ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జోరుగా నడుస్తున్నాయి. పండుగ వాతావరణం ఉట్టిపడుతుండడంతో శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతున్నది. ఉదయం 10 గంటల నుంచే కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపులు తీస్తున్నారు.
మధ్యాహ్నం ఒక ఇంటి సభ్యుల్లా అంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చర్చించుకుంటున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రగతిని పార్టీ నాయకత్వం వివరిస్తున్నది. ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతుండడం విశేషం. శనివారం తిప్పర్తి మండలం దుప్పలపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, గుర్రంపోడు మండలం కొప్పోలులో ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు.
– తిప్పర్తి/గుర్రంపోడు, ఏప్రిల్ 1
బీఆర్ఎస్ పథకాలను పంచుతుంటే బీజేపీ ధరలు పెంచుతున్నది ప్రజల బాగే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పంచుతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ధరలు పెంచుతున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితిని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తొమ్మిదేండ్ల కింద కరంట్, ఎరువులు, విత్తనాల సంచులు, మంచినీటి సమస్యలు ఎట్లుండే. రెండు వేల రూపాయల పింఛన్ ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? ఆడబిడ్డ పెండ్లికి ఒక్క రూపాయైనా ఆసరా అయ్యిందా? సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో ఇయ్యాల సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. బీజేపీని గెలిపిస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిన మోదీ మాట తప్పాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరిచారు. బీజేపీ, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలంటే ప్రతి కార్యకర్త గ్రామగ్రామాన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించాలి.
– ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
తిప్పర్తి, ఏప్రిల్ 1 : మేసినన్ని రోజులు మేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు.. మళ్లీ వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పాదయాత్రలు కాదు.. మోకాళ్ల యాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మరని, కాంగ్రెస్ పార్టీకి అధికారం కలేనని పేర్కొన్నారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలో 13 గ్రామాలకు చెందిన కార్యకర్తలతో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ అనంతరం సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందన్నారు. రాజకీయంగా తన లాంటి వారికి కూడా న్యాయం జరిగిందంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమని పేర్కొన్నారు. అత్యంత అవినీతిమంతుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు. గుజరాతీలకు, బడా వ్యాపారులకు దోచి పెడుతున్న ఘనత ఆయనదేనన్నారు. సీఎం కేసీఆర్ సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తరహా పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మండలంలోని పలువురికి మంజూరైన చెక్కులను దుప్పలపల్లిలో ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అందజేశారు. మొత్తం 53 మందికి 19,35,500 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్యాదవ్, డీసీపీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, మల్లేశ్గౌడ్, నాగేశ్వర్రావు, జ్యోతి, లొడంగి గోవర్ధన్, కందుల లక్ష్మయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ నియోజకవర్గంలో ఇరవై ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగు సంవత్సరాల్లోనే జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నాలుగున్నరేండ్లలోనే నల్లగొండను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. తిప్పర్తి మండలంలోని మామిడాల, కాశివారిగూడెం గ్రామాల వద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో అనేక పనులు చేపట్టామని చెప్పారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నానని, మళ్లీ విజయం సాధిస్తే మిగిలిన అభివృద్ధిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వాల హయాంలో వృద్ధులకు వంద, రెండొందల పింఛన్ ఇవ్వడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడేవారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు రెండు వేలు, దివ్యాంగులకు మూడు వేల రూపాయలు ఇచ్చి వారి గౌరవం పెంచిందని తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రం ఏడారిగా మారిందని, భూములు బీడు బారిపోయాయని అన్నారు. స్వరాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసి రైతులను రాజులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా భావిస్తున్నారని చెప్పారు. పంటలకు పెట్టుబడి సాయంతోపాటు రైతులు చనిపోతే రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబమంతా ఏకతాటిపై నడిచి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.