చండూరు, డిసెంబర్ 07: నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల పరిధిలోని బోడంగిపర్తిలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కాల సునంద శ్రవణ్ ప్రచారంలో (Panchayathi Elections) దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 ఏండ్ల కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో బోడంగిపర్తి నుంచి చొల్లేడు వరకు రూ.3 కోట్ల 25 లక్షలు, బోడంగిపర్తి నుంచి పుల్లెంల వరకు రూ.2 కోట్ల 75 లక్షలతో బీటీ రోడ్డు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామన్నారు.
గ్రామంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వివిధ రకాల సంక్షేమ పథకాలతో పాటు రూ.65 లక్షలతో సీసీ రోడ్లు, రూ.15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రూ.1.50 కోట్ల చెక్డాం వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. అలాగే రూ.20 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేని, గ్రామంలో తాము చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రూపాయి తెచ్చిందో చెప్పి ఓటు అడగాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గెలిపిస్తే ఏమి నిధులు తెస్తారని ఎద్దేవా చేశారు.

గ్రామం అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం, ఎమ్మెల్యే ఉండనక్కర్లేదని గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం అధికారంలో ఉన్నా లేకున్నా కొట్లాడి తెప్పిస్తామన్నారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులు అధికార పార్టీ ఉందా లేకున్నా అందరికీ వస్తాయని తెలిపారు. సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పాటు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, రిమోట్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నానని మీరు ఓటు వేసే బ్యాలెట్ పత్రంలోలో వరస సంఖ్య 6 పై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించాలి కోరారు.