నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఈ నెల 6వ తేదీ నుంచే మొదలుపెట్టింది. ఇప్పటికే భువనగిరి లోక్సభ పరిధిలోని తుంగతుర్తి, మునుగోడు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు, నల్లగొండ లోక్సభ పరిధిలోని సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది. కోదాడలో శుక్రవారం ఉదయం 11 గంటలకు, హుజూర్నగర్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలందరికీ ఆహ్వానాలు పంపింది.
ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొననున్నారు. ఇక భువనగిరి లోక్సభ పరిధిలో నేడు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలిసింది.
నేటి నుంచి వరుసగా ఈ నెల 13న ఉదయం నకిరేకల్, మధ్యాహ్నం ఆలేరు, ఈ నెల14న భువనగిరి, ఈ నెల 15న మిర్యాలగూడ, 16న ఉదయం దేవరకొండ, మధ్యాహ్నం నాగార్జునసాగర్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలకు ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా త్వరలో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం కూడా ఉండనున్నది. మరోవైపు ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలుకానుంది.