లోక్సభ ఎన్నికల్లో అటు నల్లగొండ, ఇటు భువనగిరి నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్
పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకానుండడంతో ప్రచారాన్ని కూడా విస్తృతం చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే ప్రకటించిన పార్టీ అభ్యర్థులు క్యామ మల్లేశ్యాదవ్, కంచర్ల కృష్ణారెడ్డికి గురువారం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఫామ్లు అందించనున్నారు. ఇదే సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎజెండా, ప్రచార సరళి తదితర అంశాలపై పార్టీ ముఖ్యలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లకు మరోసారి తావివ్వకుండా లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల వారీగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు కూడా పూర్తి చేసింది. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
అక్కడక్కడ కొందరు అవకాశవాద నేతలు పార్టీని వీడుతున్నా సమావేశాల సందర్భంగా ఆ ప్రభావం ఎక్కడా కనిపించ లేదు. ఇంటి దొంగలు బయటకు వెళ్లిపోవడమే పార్టీకి మేలు చేస్తుందంటూ కార్యకర్తలు స్పష్టం చేశారు. అధికారం కోసం వచ్చిన నేతలు మళ్లా అధికారం కోసమే వెళ్లిపోయారని, వీరితో పార్టీకి వచ్చిన నష్టమేమీలేదని క్యాడర్ సమావేశాల్లో బహిరంగంగానే ప్రకటించారు. సమావేశాలకు హాజరైన పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో కనిపించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా పార్టీ చెక్కుచెదరలేదని, ప్రజల్లోనూ మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలు, కరువు, సాగు, తాగునీటి ఎద్దడి, రైతుబంధు నిలుపుదల, కరెంటు కోతలు తదితర అంశాలే అస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు పోలయ్యేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పలుచోట్ల ప్రతిజ్ఞలు సైతం చేయడం విశేషం. ఈ సమావేశాల్లో పార్టీ ముఖ్యుల ప్రసంగాలకు సైతం శ్రేణుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న ఓట్లను తిరిగి లోక్సభ ఎన్నికల్లో రాబట్టుకుంటామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ నేతలు మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఏకతాటిపై పార్టీని నడిపిస్తామని ప్రకటించారు. మంగళవారం హాలియాలో జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కటిగా కలిసి పని చేస్తామంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపారు. వేదికపై ఉన్న ఇతర ముఖ్య నేతలు సైతం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు.
ఇప్పటికే గతంలో పార్టీకి నష్టం కలిగించిన కొందరు అవకాశవాదులు పార్టీని వీడారని, అసలైన నేతలే పార్టీలో ఉన్నారంటూ అందరం సమన్వయంతో నియోజకవర్గంలో మం చి మెజార్టీని సాధిస్తామని ప్రకటించారు. దీంతో సమావేశానికి హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సైతం చప్పట్లు, ఈలలు, కేరింతలతో సమ్మతిని తెలిపారు. సమావేశం ఆసాంతం మంచి జోష్లో కొనసాగడం విశేషం.
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీని వీడి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాంతో ఉన్నాయి. తన వెంట రావాలని పార్టీ నేతలు, కార్యకర్తలను సైదిరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మంత్రి ఉత్తమ్కు వ్యతిరేకంగా పోరాటం బీఆర్ఎస్తోనే సాధ్యమంటూ పార్టీలోనే కొనసాగేందుకు మరింత పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ అరాచకాలు, మోసాలపై బీఆర్ఎస్ వేదికగానే పోరాడతామని స్పష్టం చేశారు. హుజూర్నగర్లో జరిగిన పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఇతర నేతలు దిశానిర్దేశం చేయగా పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు దీటుగా ఓట్లు సాధించి సత్తా చాటుదామని ప్రతినబూనారు.
ఇతర నియోజకవర్గాల్లో సైతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం కాకుండా భారీగా ఓట్లను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నేతలు, క్యాడర్లో కనిపించింది. కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు పడిపోయారని, ఇప్పుడు పరిస్థితి అలా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కండ్ల ముందే కాంగ్రెస్ మోసాలు కనిపిస్తున్నాయని, ఈ మోసాలే ఎన్నికల అస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. నాటి కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ… నేటి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.