సూర్యాపేట, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ నేరేడుచర్ల : హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హోరెత్తింది. సభా ప్రాంగణంతోపాటు ఎటు చూసినా కనుచూపు మేరలో జన ప్రభంజనం కనిపించింది. హుజూర్నగర్ పట్టణంతోపాటు ఏడు మండలాల నుంచి సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉండగా.. ఉదయం 11 గంటల నుంచే ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రజలు గులాబీ జెండాలు చేతబట్టి డప్పులు, డోళ్లు కొట్టుకుంటూ హాజరై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరు ఉచ్చరించగానే పెద్ద ఎత్తున కేరింతలు, ఈలలు వేస్తూ గులాబీ జెండాలను రెపరెపలాడించారు. తొమ్మిదేండ్లలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ దళితబంధు అనగానే కేరింతలు కొట్టారు. అలాగే ‘ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వద్దంటున్నాడు.. రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలంటున్నాడు.
అంతే చాలా.. లేక మనం ఇస్తున్న రైతుబంధు, 24 గంటల కరెంటు కావాలా? కావాలనేవారు చేతులెత్తాలనడంతో సభలో ఉన్నవారంతా చేతులు ఎత్తి పథకాలు కావాలి.. ఉత్తమ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. ‘బీఆర్ఎస్ గెలిస్తే ఒక్కరే ముఖ్యమంత్రి ఉంటారు.. మరి కాంగ్రెస్ గెలిచేది లేదు, సచ్చేది లేదు. కానీ.. ఇప్పటికే ఓ డజన్ మంది ముఖ్యమంత్రి పేర్ల జాబితా తయారైంది. అలాంటి పార్టీ కావాల్నా?’ అని సీఎం అనడంతో వద్దంటూ జనం నినదించారు. మీ ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి కొట్లాడి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తుండు.. హుజూర్నగర్ గతంలో ఎట్ల ఉంది.. ఇప్పుడెట్ల ఉంది అని సీఎం ప్రశ్నించగా బాగుందని జనం సమాధానం చెప్పారు. ‘2019లో గెలిచిన తరువాత తాను వచ్చి కృతజ్ఞత సభలో పాల్గొని ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యాయి. ఈసారి మళ్లీ సైదిరెడ్డిని గెలిపించండి మీ ఎమ్మెల్యే కోరినట్లు ఎన్ని నిధులైనా ఇస్తా.. నియోజకవర్గంలో మిగిలి ఉన్న పనులను మొత్తం పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటా’ అని సీఎం కేసీఆర్ అనడంతో చప్పట్లతో సభ మార్మోగింది.