చండూరు, నవంబర్ 19 : అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరో మారు అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మండలంలోని బోడంగిపర్తి, తాసానిగూడెం, శిర్ధపల్లి, పడమటితాళ్ల, కోటయ్యగూడెం, ఉడతలపల్లి, గుండ్రపలి,్ల చొప్పరవారిగూడెం, కస్తాల, బంగారిగడ్డ, పుల్లెంల గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
తాస్కానిగూడెం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రారంభమైందన్నారు. 2018లో నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మొత్తం రూ. 570 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, అవి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించేందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరాలంటే ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్
బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, అందుకే తాను బీఆర్ఎస్లో చేరినట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తుందని, అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తనకు తాను ఓటు వేసుకోలేని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. మునుగుడు నియోజకవర్గం అంటే తనకు ప్రాణమంటున్న రాజగోపాల్ మరి ఇక్కడ ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదో ప్రజలు నిలదీయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆయనను నమ్మి గెలిపిస్తే 18 వేల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయాడని, ఇప్పుడు గెలిపిస్తే మళ్లీ అమ్ముడు పోతాడని ఎద్దేవా చేశారు.
అక్రమంగా సంపాదించిన డబ్బులతో రాజకీయాలను భ్రష్టుపట్టించాడని విమర్శించారు. ఏరోజు ఏ పార్టీలో ఉంటాడో తెలియని వ్యక్తిని నమ్మి మోస పోవద్దని ప్రజలకు సూచించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక నుంచి అన్న ప్రభాకర్రెడ్డితో పాటు చెల్లిలిగా తానూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కల్యాణీరవికుమార్, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, సర్పంచులు చొప్పరి అనూరాధా వెంకన్న, మెండు ద్రౌపతమ్మా వెంకట్రెడ్డి, ప్లలె వెంకటయ్య, ఎంపీటీసీలు కావలి మంగమ్మ ప్రసాద్, నాయకులు అనిల్రావు, మధుసూదన్రావు, పెద్దగోని వెంకన్న, బొడ్డు సతీశ్, వివిధ గ్రా మాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.