మిర్యాలగూడ, నవంబర్ 25: సమైక్య రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే. ఒకటో అరో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఉండేవి. పారిశుద్ధ్యం, పచ్చదనం అసలే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లుగా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. పట్టణ ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాలికలు రూపొందించి అమలు చేశాం, దాంతో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు సమకూరాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
పట్టణంలో శనివారం ఎమ్మెల్యే భాస్కర్రావు పట్టణంలోని సాగర్రోడ్డు, రైతుబజార్, మున్సిపల్ కాంప్లెక్స్, హనుమాన్పేటలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, సీనియర్ నాయకులు మదార్బాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుసుకొని కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో గురించి వివరంగా తెలిపారు. ఆయా దుకాణాదారులను, పనిచేసేవారిని కలిసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.
కూరగాయల విక్రేతలు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, కిరాణ, మొబైల్ దుకాణాలు, షాపింగ్ మాల్స్, మిఠాయి దుకాణాలు, చేపల వ్యాపారులు, మాంసం విక్రయదారులు, ఆటో వాలాలను కలిసి ఓటు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.856.30కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
వివిధ ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు, బ్రిడ్జిలు, రహదారులు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ బైపాస్, వై జంక్షన్, తడకమళ్ల క్రాస్ రోడ్డు, రాజీవ్చౌక్, సుందరయ్య జంక్షన్, ఈదులగూడ బైపాస్, హనుమాన్పేట ఫ్లైఓవర్ అభివృద్ధి పనులు చేపట్టి సౌకర్యవంతంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్పీ క్యాంపులో ఇండోర్ స్టేడియం, కేసీఆర్ కళాభారతి, సంత్సేవాలాల్ భవనం, అంబేద్కర్ భవనం, మహాత్మా జ్యోతిబా పూలే భవనం, మహా ప్రస్తానం, క్రైస్తవ శ్మశానవాటిక, ఖబరస్థాన్ నిర్మించినట్లు తెలిపారు.
పెద్ద చెరువును సుందరీకరణ చేసి మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేశామన్నారు. పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయ్లెట్స్, డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు సిబ్బందితో చెత్త లేకుండా శుభ్రం చేయిస్తూ, మొక్కలు పెంచుతూ పరిశుభ్రత, పచ్చదనం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు పలు రకాల రక్త పరీక్షలు ఉచితంగా అందేలా చేసినట్లు తెలిపారు.
నందిపహాడ్, షాబునగర్, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో మూడు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయించి పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు గానూ తనను మరో మారు ఆశీర్వదించాలని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.