నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. రెండు లోక్సభ స్థానాల పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అనంతరం అందరి ఏకాభిప్రాయంతో నల్లగొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి స్థానానికి క్యామ మల్లేశ్కుర్మను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2014 నుంచి నేటి వరకు వరుసగా మూడో సారి కూడా సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ అధినేత కేసీఆర్ బలహీనవర్గాల పట్ల మరోసారి తన నిబద్ధతను ప్రదర్శించారు. అభ్యర్థుల ప్రకటనతో ఇక ఎన్నికల కార్యక్షేత్రంలో దూకేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు
సన్నద్ధమవుతున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి 23 (నమస్తే తెలంగాణ)
గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల బరిలోకి దింగేందుకు అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నది. అందులో కీలకమైన పార్టీ అభ్యర్థుల ఎంపికను ఏకాభిప్రాయంతో పూర్తి చేసింది. నల్లగొండ లోక్సభ స్థానానికి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన పార్టీ సీనియర్ నేత కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేసింది. భువనగిరి లోక్సభ స్థానానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడేనికి చెందిన సీనియర్ నేత క్యామ మల్లేశ్ను ఖరారు చేసింది. 2014, 2019 ఎన్నికల్లో మాదిరిగానే నల్లగొండను ఓసీ సామాజిక వర్గానికి, భువనగిరిని బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లుగానే ఈ సారి కూడా అదే సామాజిక సమతుల్యతను పాటించింది. భువనగిరి లోక్సభ స్థానంలో బలమైన ఓటుబ్యాంకు కలిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్కుర్మను ఎంపిక చేయడంపట్ల హర్షం వ్యక్తమవుతున్నది.
గత కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపికపై అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల సూచనల మేరకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో పలుమార్లు సమాలోచనలు చేశారు. అందరి అభిప్రాయాలతో సరైన అభ్యర్థులపై పలుమార్లు సుదీర్ఘంగా చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలు, అభ్యర్థుల బలాబలాలు ఇలా అన్ని కోణాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్, కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అభ్యర్థుల ఎంపిక, వారి వ్యూహాలను సైతం పరిగణలోకి తీసుకుంటూ పార్టీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. ఇలా అన్ని యాంగిల్స్లో పరిశీలన అనంతరమే రెండు స్థానాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను ఖరారు చేసింది.
వాస్తవంగా భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ పేరును కూడా చివరి వరకు సీరియస్గా పరిశీలించారు. అయితే సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన కత్తి పద్మారావ్గౌడ్కు అవకాశం కల్పించడంతో భువనగిరిలో గొల్లకుర్మల సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండతో పాటు జనగాం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలతోనూ కలిసి ఉండడంతో అక్కడి పార్టీ ముఖ్యులతోనూ చర్చించారు. ఫైనల్గా రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని బీసీ వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ క్యామ మల్లేశ్ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసింది. శనివారం ప్రకటించిన అభ్యర్థుల్లో సికింద్రాబాద్కు కత్తి పద్మారావుగౌడ్, భువనగిరికి క్యామ మల్లేశ్కుర్మ, నల్లగొండకు కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించడంతో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారన్న హర్షం వ్యక్తమవుతున్నది.
నల్లగొండ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని ప్రకటించారు. కంచర్ల సోదరులిద్దరూ ఆది నుంచి తాము నమ్ముకున్న నాయకత్వం పట్ల అంచల విశ్వాసంతో పనిచేస్తారని చర్చ. తమ రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీలో ప్రారంభించారు. స్వగ్రామం ఉరుమడ్ల గ్రామ రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగారు. 2017 నవంబర్6న బీఆర్ఎస్లో చేరే వరకు తాము నమ్ముకున్న టీడీపీలోనే కొనసాగారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో అంచెలంచెలుగా పైకి వచ్చారు. కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరే నాటికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు 2018 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు బీఆర్ఎస్లో చేరారు. తన చేరిక సమయంలోనే తెలంగాణ భవన్లో కృష్ణారెడ్డి కేటీఆర్ సమక్షంలో ప్రసంగిస్తూ ఇన్నాళ్లు టీడీపీలో ఆ తారకరాముడు(ఎన్టీఆర్) కోసం పని చేశామని..ఇక నుంచి బీఆర్ఎస్లో ఈ తారకరాముడు(కేటీఆర్) కోసం అంతే నిబద్ధతతో పనిచేస్తామని కృష్ణారెడ్డి ప్రకటించడం అప్పట్లోనే అందర్నీ ఆకట్టుకుంది. అదే రీతిలో పార్టీలో చేరిన నాటి నుంచి నేటివరకు కంచర్ల సోదరులిద్దరూ పార్టీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో తమ్ముడు భూపాల్రెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా ఆయన గెలుపులో ఎన్నికల వ్యూహకర్తగా కృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించారు. తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో మేళ్లచెర్వు మండల ఇన్చార్జిగా బాధ్యత అప్పజెప్పితే మంచి మెజార్టీని సాధించి పెట్టారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గుర్రంపోడు, మునుగోడు ఉప ఎన్నికల్లో మర్రిగూడ మండలాల ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీ అభ్యర్థుల గెలుపుల్లో తన వంతు పాత్రను పోషించారు. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ సభలు జరిగినా, ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో కృష్ణారెడ్డికి మంచి పేరుంది.
దీంతో పాటు అప్పుడు టీడీపీలోనూ, ప్రస్తుతం బీఆర్ఎస్లోనూ నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలందరితోనూ కృష్ణారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో సైతం క్షేత్రస్థాయి వరకు కంచర్ల సోదరులుగా మంచి గుర్తింపు ఉంది. నిరుపేదల విద్యా, వైద్యం, వివాహా ఖర్చుల విషయంలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన స్వగ్రామం ఉరమడ్లలో ప్రతి ఆడబిడ్డ పెండ్లికి 25వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. ఇలా అనేక కోణాల పరిశీలన అనంతరమే ఈ ఎన్నికల్లో నల్లగొండకు సరైన అభ్యర్థిగా కృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భువనగిరి స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామ మల్లేశ్ను ఎంపిక చేశారు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం పార్టీ అధినేత కేసీఆర్ అన్ని రకాలుగా ఆలోచించిన మీదట క్యామ మల్లేశ్ అభ్యర్థిత్వానికి ఆయన ఓకే చెప్పారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన క్యామ మల్లేశ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్తో విభేదించి 2018లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తన లాంటి బీసీ నేతలకు సరైన గుర్తింపు లేదన్న ఆవేదన మల్లేశ్ వ్యక్త పరిచేవారు.
ఈ క్రమంలోనే బడుగుబలహీనవర్గాల సంక్షేమం పట్ల, నేతల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధికి క్యామ మల్లేశ్ ఆకర్షితులయ్యారు. గొల్లకుర్మల కోసం ప్రత్యేకంగా కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం ఆయన్ను ఆకట్టుకుంది. అదే విధంగా పార్టీలోనూ బీసీ వర్గాలకు పెద్దపీట వేయడం, పార్టీతో పాటు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడం గమనించారు. వీటిన్నింటి ప్రభావంతో పార్టీలో చేరిన నాటి నుంచి క్రమశిక్షణ కలిగిన నేతగా పనిచేసి పార్టీ అధినేత కేసీఆర్ మన్ననలు పొందారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు ఆయనకు బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టుంది. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ ఆయన స్వతహాగా మంచి పోరాట పటిమ కలిగిన నాయకుడు. బీసీలతో పాటు ఆయన సామాజికవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారు. మల్లేశ్ స్వగ్రామమైన శేరిగూడలో మొదటిసారి ఆయన పంచాయతీ సభ్యుడిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆయన స్వశక్తితో అనేక పదవులు నిర్వహించటంతోపాటు చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ అభ్య ర్థి వరకు ఎదిగిన క్యామ మల్లేశ్ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేయడంతో ఆయనకు గుర్తింపు లభించిందన్న చర్చ సర్వత్రా సాగుతున్నది.
యాదగిరిగుట్ట : నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి నల్లగొండ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తనపై నమ్మకంతో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కంచర్ల కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కృష్ణారెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, గుజ్జ దీపికలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా ప్రతి ఒక్కరి తోడ్పాటు మరవలేనిదని తెలిపారు. వీరందరి సంపూర్ణ సహకారంతో నల్లగొండ లోక్సభ స్థానంలో విజయం సాధించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఇతర ముఖ్య నేతల అండదండలు, పార్టీ నేతల, శ్రేణుల సంపూర్ణ సహకారం, సమన్వయంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గతం లో తనకు అనేక ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉందని, జిల్లా పరిస్థితులపైనా సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ మోసాలు, గతంలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి అంశాలే ఎజెండాగా ఎన్నికల్లో ముందుకు సాగుతానని తెలిపారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరుగుతున్నదని క్యామ మల్లేశ్ అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అనంతరం ఆయన స్పందిస్తూ అన్ని వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం లభించాలన్న ఉదేశంతో కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారన్నారు. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నదని తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని వారందరి సహాయ, సహకారాలతో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు. కొంతమంది అవకాశవాదంతో పార్టీని వీడుతున్నారని, అలాంటి వారు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు సీటును కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యంగా బడుగుబలహీన వర్గాలు, దళిత మైనార్జీలకు సామాజిక న్యాయం దక్కాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థి పేరు : కంచర్ల కృష్ణారెడ్డి
తల్లిదండ్రులు : కౌసల్య, మల్లారెడ్డి
పుట్టిన తేదీ : 10-05-1970
కుటుంబం : భార్య సులోచన, కుమారుడు సమరసింహారెడ్డి
స్వగ్రామం : ఉరుమడ్ల, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా
చదువు : ఎంఏ, ఎల్ఎల్బీ.
వృత్తి : హైకోర్టు అడ్వకేట్
రాజకీయ ప్రస్థానం : టీడీపీలో ప్రారంభం
అభ్యర్థి పేరు : క్యామ మల్లేశ్ కుర్మ, తండ్రి పోచయ్య
పుట్టిన తేదీ : 5-1-1965
భార్య : క్యామ జంగమ్మ, కుమారుడు :
అంజన్కుమార్
కుమార్తెలు : ప్రియాంక, అవంతి, అరోణి
స్వగ్రామం : శేరిగూడెం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా
ప్రస్తుత నివాసం : హిల్కాలనీ, వనస్థలిపురం
చదువు : గ్రాడ్యుయేషన్
రాజకీయ ప్రస్థానం : 1984లో ఎన్ఎస్యూఐలో విద్యార్ధి నేతగా ప్రారంభం