యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రజా సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తున్నది. ఎలక్షన్ ప్రచారంలో జోరు పెంచింది. ఇతర పార్టీలకు భిన్నంగా అందనంత దూరంగా దూకుడు ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేతలను సమన్వయం చేసుకుంటూనే, నిత్యం పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకమవుతున్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ సన్నాహక సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
నిత్యం జనం మధ్యే..
పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. దాంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన క్యామ మల్లేశ్ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్నారు. టికెట్ ఖరారైనప్పటి నుంచి జన బాహుళ్యంలోనే ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్లోని ముఖ్య నేతలను అందరినీ ఇప్పటికే కలిసి సమన్వయం చేసుకుంటున్నారు. కేడర్కు సైతం నిత్యం అందుబాటులో ఉంటున్నారు. మేధావులను కలిసి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. జనం మధ్యలోనే ఉంటూ సమస్యలను వినే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా పల్లెల్లో పర్యటిస్తున్నారు. సమావేశాల్లో తనదైన శైలిలో పంచ్లు, ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ప్రత్యర్థులకు అంతుపట్టకుండా గెలుపు కోసం అంతర్గతంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎంపీ సీటు గెలిపించి, కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
జోరుగా సన్నాహక సమావేశాలు
బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నది. ప్రత్యర్థి పార్టీలకు భిన్నంగా జనంలోకి వెళ్తున్నది. పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నది. వీటి బాధ్యత ఆయా అసెంబ్లీల మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది. వారే అన్నీ తామై పర్యవేక్షిస్తున్నారు. తొలుత పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత ఏడు నియోజకవర్గాల్లో ఏడు సమావేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో విజయవంతంగా సమావేశాలు ముగిశాయి. సుమారు 3వేల మందితో సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఆలేరు, నకిరేకల్, 15న భువనగిరిలో నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై ఫోకస్
ఎన్నికల కోసం సన్నాహక సమావేశాల్లో కేడర్ను సంసిద్ధులను చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం, ప్రభుత్వంలోకి వచ్చాక హామీలు అమలు చేయకపోవడంపై శ్రేణులను చైతన్యం చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీల వీడియోలను సభల్లోనే ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ఆ పార్టీ మోసాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలి..? కాంగ్రెస్ గెలిస్తే కలిగే నష్టాలను వివరిస్తున్నారు. అంతేకాకుండా పదేండ్లలో బీజేపీ చేసిన మేలు ఏం లేదని, గెలిచిపించినా ఏం చేయబోరని యజేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. బీసీ సామాజిక వర్గం కావడంతో ఆయనకు మరింత కలిసివస్తున్నది. వివాదరహితుడు, అవినీతికి దూరంగా ఉండే, మచ్చలేని మనిషి, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి కావడంతో జనం నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇటీవల మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి సైతం క్యామ మల్లేశ్పై ప్రశంసల వర్షం కురిపించారు. బీసీలతోపాటు అన్ని వర్గాలు గెలిపిస్తామంటూ మద్దతు తెలుపుతున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యామ మల్లేశ్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
కాంగ్రెస్, బీజేపీ డీలా..
బీఆర్ఎస్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మాత్రం డీలా పడుతున్నాయి. ప్రచారంలో ఆ పార్టీలు ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంతర్గత పంచాయితీలను సరిచేసుకోవడానికే నానా తంటాలు పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. అసలు ఆయన ఎవరికీ తెలియదని, ప్రచారానికి కూడా రాకపోతే ఓటెవరేస్తారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సైతం ప్రచారంలో మమ అనిపిస్తున్నారు.
రైతు సమస్యలపై పోరాడుతూనే..
బీఆర్ఎస్.. ఎన్నికల్లో జోరు ప్రదర్శిస్తూనే.. రైతు సమస్యలపైనా పోరాటం చేస్తున్నది. ఆపత్కాలంలో అన్నదాతకు అండగా నిలుస్తున్నది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. అంతే కాకుండా రైతుబంధు, రైతు రుణమాఫీ పత్తాలేకుండా పోయాయి. కర్షకులకు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంతోపాటు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ రైతులు కష్ట కాలంలో ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్పై రణభేరీ మోగించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసింది. కలెక్టర్లకు వినతి పత్రాలు అందించింది. శాంతియుతంగా నిరసన దీక్షలకు దిగింది. రైతులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నది.