సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు జరుగనుండగా ఏ మండలంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారో పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. పది గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి సమ్మేళనాలు నిర్వహించనున్నది. భువనగిరి నియోజకవర్గంలో 15, ఆలేరు నియోజకవర్గంలో 17 సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
భువనగిరి అర్బన్, మార్చి 23 : జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఈనెల 27 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకత్వం గురువారం తుది జాబితాను విడుదల చేసింది. పది గ్రామాలను కలిపి క్లస్టర్గా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమ్మేళనాలపై రోడ్ మ్యాప్ రూపొందించారు. 27న భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్లో జరిగే కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమవుతాయని, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ధూంధాంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు నియోజకవర్గాల్లో ఏప్రిల్ 16 వరకు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 28 నుంచి సమ్మేళనాలు మొదలవుతాయని చెప్పారు. భువనగిరి నియోజకవర్గంలో 15, ఆలేరు నియోజకవర్గంలో 17 సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించి మరింత చేరువ కావాలని, కార్యకర్తలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నాడు, నేడు జరిగిన మార్పులపై చర్చలు, విశ్లేషణలు చేయనునున్నారు. ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమ్మేళనాలు కొనసాగనున్నాయి. వచ్చే నెలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకుని ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో భోజన ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు.