తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం అందజేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాంతో రానున్న రోజుల్లో తాము కూడా సన్నబియ్యమే తినే అవకాశం ఉన్నదని సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు రూపాయికి కిలో బియ్యాన్ని నాటి సీఎం దివంగత ఎన్టీఆర్ దగ్గర చేస్తే, అదే పేదలకు సన్న బియ్యం ఇస్తామని ప్రకటించి నేటి సీఎం కేసీఆర్ మరింత దగ్గర చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరనున్నది. ప్రతి నెలా 32,15,799 మందికి 19,294 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తుండగా, బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీరందరికీ సన్న బియ్యం అందనుంది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ) : కాలానుగుణంగా జొన్న, రాగి, సజ్జల ఆహారానికి బదులు వరి అన్నం వాడకం అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి పేదలు దొడ్డు బియ్యమే తింటున్నారు. ప్రభుత్వం రేషన్ ద్వారా ప్రతి నెలా బియ్యం సబ్సిడీలో ఇస్తున్నప్పటికీ పెద్దలు వాటి జోలికి పోకపోతుండగా మధ్య తరగతి ప్రజలు వాటికి బదులు సన్నబియ్యం కొనుక్కొని తింటున్నారు. పేదలు మాత్రం ఇప్పటికీ దొడ్డు బియ్యమే తిని పూట గడుపుతున్నారు. అవి తినలేని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పని పరిస్థితి. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, మిషన్ కాకతీయతో చెరువులను పటిష్టపర్చడం, అనేక చోట్ల చెక్డ్యామ్ల నిర్మాణం తదితర చర్యల ద్వారా రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరిగింది.
ప్రతి ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృతంగా సన్నబియ్యం అందుబాటులోకి వచ్చాయి. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న దొడ్డు, సన్న రకం ధాన్యాలను ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ రేషన్ ద్వారా మాత్రం దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. కాలానుగుణంగా రాష్ట్రంలో నీటి వనరులు పెరుగడం, సన్న రకాల్లోనూ తక్కువ కాలంలోనే చేతికొచ్చే వంగడాలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. దాంతో దొడ్డు బియ్యంతో పోలిస్తే సన్నబియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా సీఎం కేసీఆర్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. దాంతో ఇప్పటి దాక దొడ్డు బియ్యం తిన్న పేద వర్గాలు తాము కూడా ఇక నుంచి సన్నబియ్యం తింటామనే సంతోషంలో ఉన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నది. గతంలో హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలకు దొడ్డుబియ్యం అందిచేవారు. కానీ, సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయంతో 2015 జనవరి ఒకటో తేదీ నుంచి ఆయా విద్యాసంస్థలకు సన్నబియ్యం అందిస్తున్నారు. జిల్లాలో 260 టన్నుల నాణ్యమైన సన్నబియ్యాన్ని హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్నారు. సుమారు 63,619 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత కార్డులతోపాటు అంత్యోదయ, అన్న పూర్ణ కార్డులు కలిగిన పేద వర్గాలు 32,15,799 మంది ఉండగా వారికి 10,06,560 కార్డులు ఉన్నాయి. వీరందరికీ రేషన్ ద్వారా ప్రతి నెలా 19,294 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అందచేస్తున్నది. అయితే ఇప్పటి వరకు వీరందిరికి దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి రేషన్ కార్డుదారునికి సన్న బియ్యం ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నది.
ఇప్పటికే జిల్లాలో ఉన్న అంగన్వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలతోపాటు వసతి గృహాలు, గురుకుల, మోడల్, కస్తూర్బా విద్యాలయాల్లో ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. దాంతో విద్యార్థులు మంచి భోజన సౌకర్యాన్ని పొందగలుగుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సన్నబియం సరఫరా మొదలైతే రాష్ట్రంలోని ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మంచి భోజనాన్ని ఆస్వాదించనున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీ చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టడంతో రేషన్కార్డు దారుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్తోనే ఏదైనా సాధ్యమన్న రీతిలో ప్రశంసలు కురుస్తున్నాయి.
రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం సంతోషకరం. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని తినాలంటే ఇబ్బందిగా ఉండేది. వేలు పెట్టి బియ్యం కొనలేని మాలాంటి వాళ్లకు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తానన్న ముఖ్యమంత్రి వెంటే మేమంతా ఉంటాం.
-పగిళ్ల చంద్రయ్య, కొండభీమనపల్లి, దేవరకొండ
నిరుపేదలమైన మేము ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పుడు మాకు సన్నబియ్యం కూడా ఇస్తామంటున్నారు. నూకలు తినే మాలాంటి వాళ్లకు సన్నబియ్యం ఇస్తానంటున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. మాలాంటి పేదల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది ఆయనే. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ సారే గెలువాలి. ఆయనకే మా ఓటు. మోడీ పెంచుతున్న ధరలతో ఏమీ కొనలేకపోతున్నాం. కేసీఆర్ సారు మళ్లీ గెలిచాక గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తడంట. దాంతో మాకు గ్యాస్ కష్టాలు తొలిగినట్లే. మాలాంటి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి సార్కు ధన్యవాదాలు.
-జీడిమెట్ల పాపమ్మ, జి.తిరుమలగిరి, చివ్వెంల
వచ్చే ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అందులో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించడం హర్షణీయం. ఈ నిర్ణయం మాలాంటి పేదల ఆకలి తీర్చేదిగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనేందుకు ఇదే నిదర్శనం. ఇక నుంచి మాకు దొడ్డు బియ్యం తినే ఇబ్బందులు తప్పనున్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందించనున్న సన్నబియ్యంతో మూడు పూటలా కడుపు నిండా భోజనం చేస్తాం. గొప్ప నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మా మద్దతు.
-రవి, వేములపల్లి