తిరుమలగిరి, నవంబర్ 7 : బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.అభ్యర్థులు వాడవాడలా, గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.మంగళవారం తిరుమలగిరి మండలంలో బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, అనంతగిరి మండలంలో బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎన్నికల ప్రచారంలో జనం గులాబీ జెండాలతో భారీ ర్యాలీ తీశారు.
ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పేవారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. మోసపోయి గోస పడొద్దన్నారు. తుంగతుర్తి గడ్డపై మూడోసారి గులాబీ జెండా ఎగుర వేయాలని, నియోజక వర్గ ప్రజలు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని తొండ, మర్రికుంట, వెలిశాల, సిద్దిసముద్రం, మొండిచింతతండా, రాజానాయక్తండా, కోట్యానాయక్తండా, రాఘవపురం, గుండెపురి, కన్నారెడ్డికుంటతండా, బండ్లపల్లి, మాలీపురం గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాతే పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరిగినట్లు తెలిపారు. ప్రజలను ఏనాడు పట్టించుకోని వారు నేడు అభివృద్ధి చేస్తాం ఓటు వేయండని మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు నమ్మితే గోసపడుతామన్నారు. 30 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసి చూపించినట్లు చెప్పారు. గ్రామాల్లో చెరువులు, కుంటలకు పూర్వవైభవం తెచ్చినట్లు వివరించారు. వచ్చిన నిధులన్నీ ప్రజల సంక్షేమం కోసం వెచ్చించినట్లు తెలిపారు. ఈ రోజు ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం వర్తింపజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
గతంలో పాలించిన వారు కనీసం గ్రామాలకు కూడా రాలేదు
గతంలో పాలించిన పాలకులు కనీసం గ్రామాలు, ఆవాసాలకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. తాను నిత్యం ఆవాస ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. నియోజక వర్గంలో రూ.6 వేల కోట్లతో సంక్షేమ అభివృద్ధి జరిగిందని చెప్పారు. నాడు కాలిబాటలు కూడా సక్రమంగా లేని తండాలు, ఆవాసాలకు నేడు బీటీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందని వివరించారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, ఆవాసాల్లో మౌలిక వసతులు కప్పించినట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయగా, నేడు ఆవాస తండా పంచాయతీలు సైతం స్వయం సమృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తూ, అన్ని చెరువులు కుంటలు నింపడం వల్ల నేడు భూగర్భ జలాలు పెరిగి చెరువులు, కుంటలు నిండుకుండల్లా కనిపిస్తూ.. బీడు భూములు పచ్చని మగాణిగా మారినట్లు తెలిపారు.
మరో అవకాశం ఇస్తే ఊహించని అభివృద్ధి
తనకు మరో అవకాశం ఇస్తే నియోజక వర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు, అలాగే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి, కేసీఆర్ ఆరోగ్య రక్ష, అన్నపూర్ణ పథకం, రైతు బంధు పెంపుతో పాటు, ఆసరా పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ల పెంపు జరిగి నియోజక వర్గ ప్రజలకు మరింతగా సంక్షేమాభివృద్ధి జరుగుతుందన్నారు.
అన్నదాతకు అండగా ఉన్నాం..
సమైక్య పాలనలో రైతులు అప్పులు చేసి పంట చేతికి రాక ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు గాలికి వదలకుండా సీఎం కేసీఆర్ దండుగ అన్న వ్యవసాయం పండులాగా మార్చినట్లు తెలిపారు. రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందేలా ప్రభుత్వమే ప్రీమియం కట్టి రైతు బీమా ఇస్తుందన్నారు. రాబోవు రోజుల్లోనూ అన్నదాతలకు మరింతగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్రవంతి, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.