కోదాడ, ఫిబ్రవరి 2 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టి కృషితో సత్తా చాటుదామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. తెలంగాణను అన్నిరంగాల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలబెట్టింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుదామన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేది లేదని పేర్కొన్నారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగునీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించడంపై జిల్లా ప్రతినిధులు నోరు మెదపకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇండియా కూటమి నుంచి ముఖ్యమైన పార్టీలు నిష్క్రమించాయని గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
ఓటమిపై సమీక్ష జరుపుకుందామన్నారు. తప్పొప్పులు సరి చేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు. త్వరలో జరుగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఫిబ్రవరి 4న గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10గంటలకు జరిగే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలోని 18వ వార్డు కు చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాధవిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.