తిరుమలగిరి, అక్టోబర్ 21 : తుంగతుర్తి గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని మామిడాల గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మామిడాల, కోక్యానాయక్తండా, చింతలకుంటతండా గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి విజయతిలకం దిద్దారు. వృద్ధులు ఆప్యాయంగా పలుకరించి కొడుకా నీకే మా ఓటు అని చెప్పారు.
గిరిజన మహిళలు, కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు కూడళ్లలో స్థానికులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను మూడోసారి ఆశీర్వదిస్తే తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజక వర్గాన్ని రూ.16 వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అందుకే నియోజక వర్గం ప్రజలకు రెండోసారి సేవ చేసే అవకాశం కల్పించారన్నారు.
ఇదే రీతిన మరోమారు ఉద్యమ స్ఫూర్తితో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 30 ఏండ్లలో సాధ్యంకాని అభివృద్ధిని తాను తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసినట్లు వివరించారు. గత ఐదేండ్లలో ఎన్నడూ ప్రజా సమస్యలు పట్టించుకోని వారు సంక్రాంతి పండుగకు గండిరెద్దులు వచ్చినట్లుగా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వం అందజేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే నియోజక వర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
గతంలో పాలించిన పాలకులు కనీసం గ్రామాలు, ఆవాసాలకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు పరిష్కరించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రజలను ఏనాడు పట్టించుకోని వారు నేడు అభివృద్ధి చేస్తాం ఓటు వేయండని మాయమాటలు చెబుతున్నారు, వారి మాటలు నమ్మితే గోస పడుతామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చినట్లు తెలిపారు. రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5 లక్షల బీమా ప్రభుత్వం అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్టం ఏర్పాటుకు ముందు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పొలాల్లో కనిపించాల్సిన తడి, అన్నదాత కళ్లలో కనిపించేది. కర్షకులు కరువు కోరల్లో చిక్కుకున్నారు. బంగారం పండాల్సిన భూమలు నెర్రెలు బారి బీళ్లుగా మారాయి. సాగునీరు లేక విద్యుత్ అందక తెచ్చిన అప్పులు తీరక రైతులు కాలం చేశారు. అయినా నాటి ప్రభుత్వాలు స్పందింలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి పోవాలని ఉద్యమ నాయకుడైన సీఎం కేసీఆర్ సాగునీటితో పాటు విద్యుత్ సమస్యను రూపుమాపాడు. తాగునీటి కష్టాలు కూడా తీరాయి. ప్రస్తుతం చెరువులు, కుంటలు నిండుకుండల్లా జలకళ సంతరించుకున్నాయి. బీడు భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం నీళ్లుతో నేడు తుంగతుర్తి పల్లెలు పచ్చని పంటలకు నిలయంగా మారాయన్నారు.
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రతి ఇంటికి పథకాలు అందాయన్నారు. తిరుమలగిరిని దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించడం జరిగిందన్నారు. మరింత అభివృద్ధి కోసం మరోమారు తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, మార్కెట్ చైర్పర్సన్ కొమ్మినేని స్రవంతి, జడ్పీటీసీ అంజలి, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సర్పంచులు బెడద కరుణాకర్, రవీందర్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొమ్మినేని సతీశ్, తిరుమణి యాదగిరి, తెడ్డు భాస్కర్, వేములు శ్రీనివాస్, వట్టె కృష్ణ, కృష్ణారెడ్డి, బర్ల వెంకన్న, బత్తుల శ్రీనివాస్, కందుకూరి లక్ష్మయ్య, షకీల్, మౌలానా, బాబు, సందీప్, యాకూబ్నాయక్, గోపాల్రెడ్డి, సురేందర్, పాల్గొన్నారు.