సూర్యాపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు నీరాజనం పలికారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్న గులాబీ దళపతికి బ్రహ్మరథం పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, భువనగిరి మీదుగా జనగామ జిల్లాకు చేరుకున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో ప్రవేశించిన అనంతరం తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, వెలుగుపల్లి, తిమ్మాపురం, భాషానాయక్తండా, యర్కా రం మీదుగా సూర్యాపేట పట్టణానికి కేసీఆర్ చేరుకున్నారు.
తుంగతుర్తి మండలం మొండికుంట తండా, వెలుగుపల్లి, సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామాల్లో రైతులను కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. జిల్లాలో దాదాపు 40 కిలోమీటర్ల మేర కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణించగా ఆయా గ్రామాల్లో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేసీఆర్కు అభివాదం తెలిపారు. కేసీఆర్ కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సూర్యాపేట పట్టణంలో పర్యటించినంత సేపు కేసీఆర్కు వీధుల్లో జనం అభివాదం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొని అక్కడ మధ్యాహ్న భోజనానంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో పాల్గొన్నారు.