నల్లగొండ ప్రతినిధి, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు నెత్తిన ఎర్రటి ఎండతో మాడు పగిలే పరిస్థితి ఉన్నా… రైతుల కండ్లు స్వయంగా చూసి, ఆలకించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతటి రణరంగానికైనా సిద్ధమని ప్రకటించారు. ఎండిన పొలాలను చూస్తూ రైతుల బాధలను ఆలకించిన కేసీఆర్ చలించిపోయారు. రైతులకు ధైర్యం చెబుతూ.. ఎకరాకు 25వేల పరిహారం ఇచ్చే వరకు కొట్లాటకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతు గొంతుకగా బీఆర్ఎస్ నిలుస్తుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి, ఎర్కారం గ్రామాల్లో ఆదివారం రైతులతో ముచ్చటించారు. దారి పొడువనా ఎండిన పొలాలను చూస్తూ ముందుకు సాగారు.
అనంతరం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్లో నీళ్లున్నా ఇవ్వలేక ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్దని విమర్శించారు. ‘రాష్టంలో 15లక్షల పై చిలుకు ఎకరాల్లో పంటలు ఎండినయ్. పంటలు ఎండని జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టు కలుపుకొని మూడున్నర లక్షల ఎకరాల నుంచి నాలుగు లక్షల ఎకరాల మధ్య పంటలు ఎండాయి. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిలో 25వేల ఎకరాలు.. ఇవి రైతులు చెప్పిన లెక్కనే. సూర్యాపేటలో 24వేల ఎకరాలు… భయకరంగా సాగర్ ఆయకట్టును ఎండబెట్టారు.
నాగార్జునసాగర్లో ఈ రోజుకు కూడా కనీస నీటిమట్టం కంటే ఏడు టీఎంసీ నీరు ఎక్కువగా ఉంది. దాని కింద కూడా మరో 7 టీఎంసీల నీరు ఉంది. దాదాపు 14 నుంచి 15 టీఎంసీ నీరు ఇప్పుడు కూడా వాడుకునేందుకు అవకాశం ఉంది. ఆనాడు కూడా కేఆర్ఎంబీ ఉండే.. అదేమన్న సూపర్ బాస్నా. అది రెండు రాష్ర్టాల మధ్య నీటి పంపిణీకి సమన్వయ కర్త. సాగర్ను కేఆర్ఎంబీకి అప్పజెప్పి… తెలివి తక్కవగా చూస్తున్నారు. ఇవ్వాళ నాగార్జునసాగర్ డ్యామ్ మీదకు ఎక్కలేని దుస్థితిని తెచ్చిన అసమర్థ ప్రభుత్వం ఇది. అప్పట్లోనే కేఆర్ఎంబీ ఉన్నా కానీ ఆంధ్రతో పోటీ పెట్టి నీళ్లు తీసుకొచ్చి పంటలు కాపాడిన చరిత్ర బీఆర్ఎస్ది.
వరుస తడులతో 18 పంటలు పండాయి. ఎందుకు ఇవ్వాళ సాగర్ కింద రైతాంగం తండ్లాడుతున్నది. పట్టుకొమ్మల్లా ఉన్న పల్లె సీమల్లో ఇవ్వాళ బోరుబండ్ల హోరు వినిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా బోరు బండ్ల అడ్రస్ లేదు’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వస్తది పోతది కానీ… ప్రజలను ఆగం చేయొద్దు అని కేసీఆర్ హితవు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు వెను దిరిగేది లేదు. ఎండిన పంటకు ఎకరాకు 25వేల రూపాయల పరిహారం ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ బృందాలు సైతం గ్రామాగ్రామ తిరిగి నష్టం లెక్కలు తీస్తామని, రైతు గొంతుకగా నిలుస్తామని చెప్పారు. రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఎర్కారంలో ఒక మహిళా రైతు తన మీద పడి ఏడ్చిందని, నీళ్లు ఇస్తామంటేనే నాట్లు వేసుకున్నామని ఆ మహిళ చెబుతుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాళ కేసీఆర్ వస్తున్నాడని నీళ్లు వదిలారని, ఇదే తెలివి 15 రోజుల కిందట చేసి ఉంటే పంటలు మిగిలేవని తెలిపారు. ఇది వచ్చిన కరువు కానే కాదూ.. ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పారు. కష్టకాలంలో రైతులకు భరోసానిస్తూ వారి పక్షాన నిలబడుతామని స్పష్టం చేశారు.
రుణమాఫీ, బోనస్ సాధన కోసం బీఆర్ఎస్ పోరుబాటను కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గతం కంటే ఒక్క కొనుగోలు కేంద్రం తక్కువగా పెట్టినా ఒప్పుకోబోమన్నారు. డిసెంబర్ 9 నుంచే ధాన్యానికి 500 బోనస్ ఇస్తానన్న రేవంత్రెడ్డి ఎక్కడ పడుకున్నాడని ప్రశ్నించారు. యాసంగి ధాన్యానికి బోనస్ ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరుబాట పడుతుందని వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు బోనస్ కోసం బీఆర్ఎస్ నేతలు వినతిపత్రాలు అందించాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా 6వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులతో కలిసి బోనస్ కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఏ విషయంలోనైనా రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యల వైపు ఆలోచన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని, రైతుల పక్షాన బీఆర్ఎస్, కేసీఆర్ ఎప్పటికీ అండగా ఉంటారని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నల్లగొండ, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంతోష్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు క్యామ మల్లేశ్యాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపికాయుగేంధర్రావు, నేతలు సోమ భరత్కుమార్, చెరుకు సుధాకర్, జడ్పీటీసీ జీడి భిక్షం, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాన కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, ఎస్ఏ రజాక్, బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మాజీ సర్పంచ్ చింతలపాటి మౌనిక తదితరులు పాల్గొన్నారు.
నిడమనూరు : మండలంలోని వేంపాడు గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఎండిన వరి పంటను పరిశీలించి రైతులకు భరోసా కల్పించేందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయ్యింది. వేంపాడుకు సాయంత్రం 4.30 గంటలకు వచ్చేందుకు షెడ్యూల్ ఖరారు కాగా రైతులతోపాటు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. షెడ్యూల్లో భాగంగా సూర్యాపేట లో ఆలస్యమైంది. రోడ్డు మార్గంలో ఇబ్బందులు తలెత్తే అవకాశమముండడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. కేసీఆర్ ఒక్కసారి వచ్చి పోతే బాగుండునని రైతులు కోరారు.
తుంగతుర్తి : తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి, మొండికుంట తండాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. మొండికుంట తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు దయ్యాల వెంకటనారాయణ, ఆంగోతు హర్జ, సోమ్లా సైదులు, భూక్యా శ్రీను, ఆంగోతు సాలమ్మ, సురేశ్, ఆంగోతు వెంకన్నను పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన వరి కంకులను కేసీఆర్ చేతికి అందించి రైతులు రోదించారు. దుఃఖంలో ఉన్న రైతులకు ఓదార్చి ధైర్యం చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామమన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు రుణమాఫీ, రైతు బంధును తెచ్చుకుందామని భరోసా కల్పించారు.
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా పొలాలకు సాగు నీళ్లు మంచిగా వచ్చినయి. పంటలు మస్తుగా పండి సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే రోజులు వచ్చాయి. ఎనిమిది సంవత్సరాల నుంచి కాళేశ్వరం సాగు నీళ్లు వస్తున్నాయి. ఈ సారే నీళ్లు రాలేదు. నీళ్లు వస్తాయని ఆశలో 5 ఎకరాల్లో వరి సాగు చేసినం. నీళ్లు లేక పొలం మొత్తం ఎండిపోయింది. 50వేల పెట్టుబడి పెట్టినదంతా పోయింది. పంటలు ఎండిపోవడానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి. ప్రభుత్వంతో నష్టపరిహారం ఇప్పిస్తానని కేసీఆర్ ధైర్యం చెప్పారు.
– కొదమగుండ్ల, సరోజనమ్మ, మహిళా రైతు, ఎర్కారం, సూర్యాపేట మండలం
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు బంగారం ఓలే బతికినం. మా జీవితాలు ఇట్లవుతాయని ఎన్నడూ అనుకోలే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న చక్కదనాల కాలాన్ని చేతులారా కాలదనుకున్నట్లయ్యింది.. ఎప్పటోలనే కాల్వ నీళ్లు వస్తాయని ఆశ పడి పంటలు సాగు చేసినం. కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తెచ్చింది. 11 ఎకరాల్లో వరి సాగు చేస్తే నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోయింది. కాంగ్రెస్ను నమ్ముకుంటే కష్టాలే మిగిలాయి.
– ఆంగోత్ హర్జ, మొండికుంట తండా, తుంగతుర్తి మండలం
నాకున్న నాలుగు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసిన. 4లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన. ఒక పక్క ఎస్సారెస్పీ జలాలు రాక, మరో పక్క బోర్లు అడుగంటి పోవడంతో 8ఎకరాల వరి పంట ఎండింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు వచ్చాయి. కేసీఆర్ సార్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. 25 వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇప్పిస్తామని భరోసా కల్పించారు.
-ధరావత్ సురేశ్, కౌలు రైతు, మొండికుంట తండా, తుంగతుర్తి మండలం
గడిచిన పదేండ్ల కాలంలో ఇంత కరువు రాలేదు. బోర్లు ఎండిపోయినయి. ఎప్పటి మాదిరిగానే కాల్వ నీళ్లు వస్తాయని పంటలు సాగు చేసినం. తీరా నీళ్లు రాక 15ఎకరాలు సాగు చేస్తే 12 ఎకరాలు పూర్తిగా ఎండింది. 5లక్షలపై పైగా నష్టపోయినం. కేసీఆర్తో మా బాధను చెప్పుకున్నాం. రైతులంతా అధైర్యపడొద్దని అండగా ఉంటామని చెప్పిండు.
-ధరావత్ సోమ్లానాయక్, బుజ్జి, మొండికుంట తండా, తుంగతుర్తి మండలం