సమైక్య రాష్ట్రంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే ఉండేది. దూర
ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక భారం. ఉన్నత వర్గాలకు దీటుగా రాణించలేక చాలా మంది
విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లో వెనుకబడి పోయేవారు. ఈ నేపథ్యంలో పేదలు, బడుగు,
బలహీన వర్గాలకు నాణ్యమైన చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తూ సీఎం కేసీఆర్ గురుకులాలు
ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 మహాత్మా జ్యోతి రావు పూలే గురుకులాలను ఏర్పాటు చేశారు. వాటిలో 17,780 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 1.25 లక్ష ఖర్చు చేస్తున్నది. హైస్కూల్ స్థాయి నుంచి డిగ్రీ వరకు గురుకులాలు కొనసాగుతుండగా ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట, నవంబర్ 6 : గత ప్రభుత్వాల హయాంలో నాణ్యమైన విద్య కరువైంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అభ్యసించాలంటే జిల్లా విద్యార్థులు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలను మంచిగా చదివించేందుకు తల్లిదండ్రులు అధికంగా ఖర్చు చేసేది. కొంత మంది రైతులు భూములను తనఖా పెట్టడం, అప్పు చేసే దుస్థితి ఉండేది. ఉద్యమ సమయంలో ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్.. మారుమూల గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని సంకల్పించారు.
అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గానికి రెండు నుంచి మూడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను స్థాపించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.25 లక్షల ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం అందిస్తున్నారు. వ్యాయామం చేయిస్తూ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. దాంతో జిల్లాలో సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి నుంచి నేడు మండల కేంద్రాల్లోనే నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2017లో 30 బీసీ బాలికలు, బాలుర గురుకుల పాఠశాలలను స్థాపించగా.. వాటిల్లో పైసా ఖర్చు లేకుండా 17,880 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ వరకు విద్యను అందిస్తుండగా ఎన్నికల తరువాత పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.
బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటు ఎన్నికల కోసమో, అధికారంలోకి రావాలన్న ఆలోచనతో పుట్టింది కాదు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ గ్రామాలు తిరుగుతున్న సమయంలో మారుమూల ప్రజలు చదువుకు ఎంత దూరం ఉన్నారో తెలుసుకుని వారికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో గురుకులాలను ఏర్పాటు చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా సీఎం కేసీఆర్ ఏ సంకల్పంతో గురుకులాలు ఏర్పాటు చేశారో ఆ మహాద్భుత సంకల్పం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే నెరవేరుతున్నది.
అట్టడుగు పేదలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలన్న లక్ష్యం సాకారమైంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ, ఉపాధ్యాయుల వినూత్న బోధనలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీ గురుకుల విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. ఆడుతూ పాడుతూ చదివేస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, పదో తరగతి విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలతో సమానంగా అత్యధిక మార్కులు సాధించిన జాబితాలో చేరిపోయారు.
విద్యార్థులు శారీరక, మానసిక వికాసానికి నిత్యం యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయిస్తున్నారు. వారికి ఇష్టమైన ఆటలు ఆడిస్తున్నారు. ఉదయం 5:15 నుంచి 6 గంటల వరకు వ్యాయామం, యోగా క్లాసులు ఉంటాయి. సాయంత్రం 4:30 నుంచి 5:45 గంటల వరకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షాట్ ఫుట్, లాంగ్జంప్, స్కిప్పింగ్, షటిల్ వంటి ఇండోర్ ఆటలతో గురుకులాలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో 15 బాలుర, 14 బాలికల పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరో పాఠశాలలో డిగ్రీ కళాశాలను నెలకొల్పారు. వీటిల్లో ఈ ఏడాది 17,880 మంది విద్యార్థులు చదువుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 గురుకులాలు ఉండగా మోటకొండూర్ (బాలికల)లో 603 మంది విద్యార్థులు, వలిగొండ (బాలికల)లో 533, భూదాన్ పోచంపల్లి (బాలుర)లో 522, చీకటిమామిడిలో కొనసాగుతున్న రాజాపేట పాఠశాలలో 469 మంది, తూప్రాన్పేట (బాలికల), అనంతారం (బాలుర) పాఠశాలల్లో 930 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో కావాల్సినంత స్థలం లేకపోయినా ప్రైవేట్ సంస్థల భవనాలను అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో శాశ్వత భవనాలను నిర్మించి పీజీ విద్యను సైతం సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది.
పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్యా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ద్వారా ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది. పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, 3 జతల యూనిఫాం, ట్రాక్ సూట్, 2 జతల షూస్, కార్పెట్స్, బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ అందజేస్తున్నది. ఉదయం రాగిజావ, అల్పాహారం, మధ్యాహ్నం మటన్, చికెన్, కూరగాయలతో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఒక సీజనల్ పండును అందజేస్తున్నారు. వీటితోపాటు ప్రతి నెలకు బాలురకు రూ.125, బాలికలకు రూ.140 కాస్మొటిక్ చార్జీలు సైతం ఇస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ర్టాన్ని 65 ఏండ్లు పాలించింది. ఎక్కడికక్కడ దోచుకుతిన్నారే తప్ప అభివృద్ధి చేయాలన్న సోయి రాలేదు. అప్పట్లో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న ఆలోచన చేయలేదు. ఇక్కడి ప్రజలంతా హైదరాబాద్కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రతి నియోజకవర్గానికి మూడు బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆరేండ్లుగా వేల మంది విద్యార్థులకు సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన విద్యను అందజేస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.25 లక్షల ఖర్చు చేస్తున్నది. విద్యార్థులకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరుతున్నది. గురుకులాల్లో చదువుతున్న ఎంతో మంది విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతున్నారు. మోటకొండూర్ బీసీ గురుకులాలకు చెందిన విద్యార్థినులు 2022-23లో ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో 6, 7, 8, 12 ర్యాంకులను సాధించారు. 2021-22లో విద్యార్థిని భార్గవి, 2022-23లో ప్రణతి ఐఐఐటీకి ఎంపికయ్యారు. పలువురు విద్యార్థులు ఇన్స్పైర్ రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో మొదటి బహుమతులను గెలుచుకున్నారు. 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిట్లో మొదటి బహుమతులను పొందారు.
గురుకులాల్లో బోధనా పద్ధతిలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయురాలు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించి అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. దాంతో చదువులో వెనుకబడిన విద్యార్థులు సైతం మంచిగా రాణిస్తున్నారు. అదేవిధంగా ఆంగ్ల భాషలో నైపుణ్యాన్ని పెంచేందుకు ‘కరడిపతే’ పేరిట దృశ్య, శ్రవణ మాధ్యమం ద్వారా బోధిస్తున్నారు. దిన చర్యలో ఉపయోగించేలా పదాలు వాడుతూ ఆడుతూ పాడుతూ భాష నేర్చుకునేలా చేస్తున్నారు.
గణితమంటే భయపడే విద్యార్థుల కోసం కాన్సెప్ట్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారు. మూడు నెలల పాటు ప్రత్యేకంగా ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదో తరగతిలో చేరే విద్యార్థులకు ఏడాది మొత్తం గణితంపై ప్రత్యేక బోధన ఉంటుంది. నిపుణుల బృందం ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నది. ఉపాధ్యాయులకు బోధన పద్ధతులపై క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తున్నది. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టును బోధించిన అనంతరం ప్రతి పాఠాన్ని వీడియోల ద్వారా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి అలవాట్లు, ఆలోచనలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు. పాఠాలు పూర్తయిన అనంతరం ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.