నార్కట్పల్లి, జూలై16 : ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో రూ. కోటి 20 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో కలియతిరిగి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని స్థానికులను ఆరా తీశారు. అనంతరం సర్పంచ్ ఈద మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని, అందుకు నిదర్శనం గ్రామాల అభివృద్ధి, ప్రతీ ఇంటికి అందుతున్న సంక్షేమం అన్నారు.
రైతును రాజు చేయాలనే తపనతో నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తుంటే 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలతో మమేకమై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెల్లంలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కోసమే తాను పార్టీ మారానని సీఎం చొరవతో ప్రాజెక్ట్ను పూర్తి చేసినట్లు చెప్పారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో నలుదిక్కులా మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్లు నిర్మిస్తామని, ఈ గ్రామం నుంచి వేరే గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లు కూడా వేయిస్తామన్నారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు గ్రామానికి చెడ్డపేరు తేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు యానాల అశోక్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, పుల్లెంల ముత్తయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
రామన్నపేట : నకిరేకల్ అభివృద్ధి ప్రధాత, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫ్లెక్సీకి పట్టణ కేంద్రంలోని 10వ వార్డు ప్రజలు క్షీరాభిషేకం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పదించి పరిష్కరించడంతో పాటు, వీధులకు సీసీ రోడ్లు మంజూరు చేయించి పనులు వేగంగా పూర్తి చేయిస్తుండంపై హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు బడుగు రఘు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్పై సీరియస్
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీరియస్ అయ్యారు. పట్టణంలో రూ.26 కోట్లతో చేపడుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఉన్న కొంతమంది షాపు యజమానులు విస్తరణలో భాగంగా స్లాబులు నిర్ణీత కొలతల మేరకు తొలగించడం లేదని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులను పారదర్శకంగా చేపట్టాలని, స్లాబులుగానీ, షాపులు, గోడలు గానీ కొలతల మేరకు సమానంగా తొలగించాలని ఆదేశించారు. కమిషనర్ స్పందిస్తూ.. కడపర్తి రోడ్డు నుంచి సెంటర్ వరకూ మళ్లీ కొలతలు వేసి షాపు యజమానులకు ఇబ్బందులు లేకుండా అందరికీ సమాన కొలతలు ఉండేలా చూస్తామని తెలిపారు. నిర్ణీత గడువులోగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, ఎస్ఐ బి.సుధీర్కుమార్, కౌన్సిలర్ కందాల భిక్షంరెడ్డి, నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, నడికుడి వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకన్న ఉన్నారు.
కుల వృత్తిదారుల సంక్షేమానికి కృషి
చిట్యాల : సీఎం కేసీఆర్ సారథ్యంలో కుల వృత్తిదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలానికి చెందిన కుమ్మరుల సంఘం ప్రతినిధులు నార్కట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి కమ్యూనిటీహాల్ నిర్మించడంతో పాటు రూ.లక్ష పథకంలో ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.