హాలియా, జనవరి 28 : దశాబ్ద కాలం పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు దర్జాగా రెండు కార్లు పంటలు పండించుకొని ఆనందంగా జీవించారు. కాలు అడ్డం పెడితే పొలం పారడంతోపాటు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో రైతులు చింత లేకుండా ధాన్యం పండించుకున్నారు. ఈ ఏడాది ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద రాకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు పని లేకుండా పోయింది. దీంతో జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో మిర్చి, బత్తాయి తోటల్లో కూలి పనుల కోసం నిత్యం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఆటోల్లో ఇబ్బంది పడుతూ కిక్కిరిసిపోతున్నారు.