చండూరు, ఆగస్టు16 : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కనివ్వొద్దని, ఒక వేళ ఆ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన సభ జన సమీకరణలో భాగంగా మండలంలోని గొల్లగూడెం, చొప్పరివారిగూడెం, కస్తాల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి తన కాంట్రాక్టుల కోసం స్వార్ధంతో చేసిన రాజీనామాతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఉప ఎన్నిక అంటే వ్యక్తుల మధ్య పోటీకాదు, పార్టీల మధ్య పోటీ అని అన్నారు.
సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి రక్షిత తాగునీరు అందించడంతో నియోజకవర్గంగా ఫ్లోరైడ్ రహిత మారిందన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమావేశాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, యువజన విభాగంఅధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పెండ్యాల గీత, సర్పంచులు మెండు ద్రౌపతమ్మా వెంకట్రెడ్డి, చొప్పరి అనురాధావెంకన్న, మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన వెంకటేశం, కట్టా భిక్షం, గుండమల్ల శ్రీనివాస్, ఊరుగుండ్ల వెంకటేశ్వర్లు, దోటి శ్రీను, మెండు బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.