బొడ్రాయిబజార్, డిసెంబర్ 1 : దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్లో నిర్వహించిన సీపీఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎనిమిదేండ్ల క్రితం రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1100 దాటిందన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకులు మౌనం పాటించడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా ఈడీ కేసులు బీజేపీ యేతర ప్రభుత్వాలపైనే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ మంత్రినైనా అరెస్టు చేశారా.. బీజేపీ మంత్రులేమైనా కడిగిన ముత్యాలా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ మొదలుకొని స్థానిక కౌన్సిలర్ వరకు బీజేపీ నాయకులు అవినీతి కోరల్లో పీకల్లోతు మునిగిపోయారన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా మొదలుకొని బీజేపీ నేతలంతా అవినీతిపరులే అన్నారు. ముందు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. దేశంలోని వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులపై దాడి చేసే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ నివేదికను ప్రవేశ పెట్టారు. ఎల్లావుల రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనంతుల మల్లీశ్వరి, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, ఎల్లంల యాదగిరి, డి. ధనుంజయ్నాయుడు, మండవ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, బత్తినేని హనుమంతరావు, దేవరం మల్లేశ్వరి, ఎస్కే.లతీఫ్, దొడ్డ వెంకటయ్య, రెమిడాల రాజు, కొండా కోటయ్య, మూరగుండ్ల లక్ష్మయ్య, ఉప్పతల కోటమ్మ, వై. సింహద్రి, సోమిరెడ్డి, పాపిరెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.