బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ దళితులను అవమానాలకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు. దళితుల ఆర్థిక పురోభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని, ఈ పథకంపై అవగాహన పెంపొందించుకొని ఐక్యతను చాటాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ ఉన్నారు.
చండూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో దళితుల ఆర్థిక పరిపుష్టే ప్రభుత్వ ధ్యేయమ ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. చండూరులో దళిత సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 75యేండ్ల స్వతంత్ర భారతంలో దళితులకు ఎన్నడూ లేని గౌరవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లభించిందన్నారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో దళితబంధు అమలు చేయడం హర్షనీయమన్నారు. రూ.22వేల కోట్లకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ తాకట్టు పెట్టిన దొంగ రాజగోపాల్రెడ్డికి ఉపఎన్నికలో డిపాజిట్ గల్లంతు చేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోడి వెంకన్న, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు గడ్డం నర్సింహ, దళితబంధు సమితి సభ్యులు బరిగెల లింగయ్య, దాసరి కోటేశ్, ఇరిగి గురునాధం, రామన్న, దామెర యాదయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో దళిత సంఘాల నాయకులతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ మెండు మోమన్రెడ్డి, దళితబంధు జిల్లా డైరెక్టర్ ఎల్.నర్సింహ, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఊరిపక్క నగేశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి
సంస్థాన్ నారాయణపురం : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షమ పథకాలే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపిస్తాయని మండల ఇన్చార్జి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆదివారం వారు మునుగోడుకు వెళ్తూ మార్గమధ్యలో మండల కేంద్రంలో కాసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి రెండు జాతీయ పార్టీలకు చెమటలు పడుతున్నాయన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, నాయకులు తెలంగాణ భిక్షం, బుగ్గ రాములు పాల్గొన్నారు.
నేడు నాంపల్లిలో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్,
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ చిరుమర్తి
నాంపల్లి : మండల కేంద్రంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళన, వనభోజన కార్యక్రమ సభాస్థలిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదివారం పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎంసీకోటిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహారావు ఉన్నారు.