భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 8 : చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భువనగిరి పట్టణానికి చెందిన కైరంకొండ చంద్రకాంత్ ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరి బంధువు ఇంట్లో దశదినకర్మకు యాదగిరిగుట్ట పట్టణానికి వెళ్లాడు. అదే రోజు రాత్రి చంద్రకాంత్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దాంతో ఆయన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు అనుమానితులుగా పాత నేరస్తులైనా విశాఖపట్టణానికి చెందిన బండు గోవింద్, ఆలూరి చిన్నాను సికింద్రాబాద్లోని ఓ హోటల్లో అదుపులో తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించారు. చోరీ చేసిన ఆభరణాలను గోవిందు తన అన్న చిన్నా సాయంతో అట్టికాగోల్డ్ కంపెనీలో తాకట్టు పెట్టాలని నిశ్చయించారు. ఇందుకు ఆ కంపెనీలో పనిచేసే ట్రావెలింగ్ ఎగ్జిక్యూటివ్ రాజేందర్ను సంప్రదించగా కొంత బంగారాన్ని రాజేందర్ తీసుకుని టోలీచౌకి బ్యాంచ్ మేనేజర్ దుగ్గిరి గిరిబాబు, ఏరియా మేనేజర్ కడవెళ్లి శ్రీనివాస్నాయుడు వద్ద కుదువపెట్టగా రూ.1.80 లక్షల నగదు పొందారు.
సదరు నగదును నిందితుడు గోవింద్ తన అకౌంట్ నుంచి వదిన (చిన్నా భార్య)కు ట్రాన్స్ఫర్ చేయించినట్లు ఒప్పుకున్నాడు. చోరీకి పాల్పడిన నిందితుడితో పాటు, ఆయనకు సహకరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గోవింద్, ఆలూరి చిన్నా, ఎలిగె రాజేందర్ను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నేరస్తులు దుగ్గిరి గిరిబాబు, కడవెల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.70 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. గోవిందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో దొంగతనాల్లో నేరస్తుడని, గతంలో పలుమార్లు జైలుశిక్ష అనుభవించాడని చెప్పారు.