వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
గతేడాది కన్నా14 శాతం పెంపు
పంట రుణాలకు అత్యధికంగా రూ.2707.75 కోట్లు
ప్రాధాన్యతా రంగాలకు 3183.28కోట్లు
ప్రాధాన్యేతరాలకు 173.20కోట్లు
2022-23 రుణ ప్రణాళికను ఆవిష్కరించిన
కలెక్టర్ పమేలాసత్పతి
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ పంట రుణాలకు రూ,2707.75 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిర్ణయించాయి. స్వయం సహాయక సంఘాలకు రూ,487.09 కోట్లు కేటాయించాయి. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక ప్రణాళికను కలెక్టర్ పమేలాసత్పతి కలెక్టరేట్లో బుధవారం విడుదల చేశారు. అభివృద్ధిలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు.
భువనగిరి కలెక్టరేట్, జూన్ 22 : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో 2022-23 వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యేతర రంగాలకు నిధులను విభజించారు. గత వార్షిక ప్రణాళి కన్నా ఈ ఏడాది 14శాతం పెంచి రూ.419.39 కోట్లను ఎక్కువ కేటాయించారు. 2022-23 జిల్లా వార్షిక ప్రణాళిక రూ.3,356.48 కోట్లుగా బ్యాంకులు నిర్దేశించాయి. ప్రాధాన్యత రంగాలకు రూ, 3183.28కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.173.20కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించగా పంట రుణాలకు రూ.2,707.75 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిర్ణయించాయి. స్వయం సహాయక సంఘాలకు రూ. 487.09 కోట్లు ఇవ్వనున్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 321.32 కోట్లు కేటాయించారు. పరిశ్రమలకు కేటాయింపులు చేపట్టడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం కల్పించినట్లయ్యింది.
గత ఏడాది కన్నా 14 శాతం పెంపు
జిల్లా వార్షిక రుణాలను గత సంవత్సరం కన్నా ఈ ఏడాది 14 శాతం పెంచారు. రూ.419.39 కోట్లు అధికంగా కేటాయించారు. జిల్లాలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహదపడనున్నాయి.
అర్హులకు సకాలంలో రుణాలు అందించాలి
ప్రాధాన్యతా రంగాలతోపాటు విద్యారుణాలపై దృష్టి సారించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
అర్హులకు రుణాలను అందించి ఆర్థిక ఎదుగుదలకు బ్యాంకులు దోహదపడాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ 103శాతం, మెప్మా 109 శాతం రుణ లక్ష్యం సాధించడం పట్ల బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సకాలంలో రుణాలను మంజూరు చేసి వారి ప్రగతికి తోడ్పడాలన్నారు. ప్రాధాన్యతా రంగాలతోపాటు విద్యారుణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. గతేడాది మాదిరిగా రుణ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించి ఆర్థిక, సామాజిక ప్రగతికి తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీరామకృష్ణ, ఎల్డీఓ ఆర్బీఐ పూర్ణిమ, నాబార్డు డీడీఎం వినయ్కుమార్, డీఆర్డీఓ మందడి ఉపేందర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, డీటీడీఓ మంగ్తానాయక్, ఎస్బీఐ ఆర్ఎం కృష్ణమోహన్, ఏపీజీవీబీ ఆర్ఎం బీవీ రావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.