యాదాద్రి భువనగిరి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : 51 పరిశ్రమలకు శ్రీకారం.. కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం.. హ్యాండ్లూమ్ సేల్స్ షోరూమ్కు భూమి పూజ.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్.. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యాలయం.. టిఫ్ ఆఫీస్ ప్రారంభోత్సవాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఇన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శ్రీకారం చుట్టారు. అది కూడా కేవలం మూడు గంటల వ్యవధిలోనే. ఆయన ఓపిక, ఆసక్తికి పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోయేలా ఉత్సాహంగా మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పారిశ్రామిక ప్రగతి ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్తోపాటు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఓపికగా.. అంతటా కలియతిరుగుతూ
జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఓపికగా, అంతటా కలియతిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిశ్రామికవేత్తలతో ప్రశంసలు అందుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30గంటలకే రోడ్డు మార్గం ద్వారా మంత్రి కేటీఆర్ జిల్లాకు చేరుకున్నారు. మొదటగా కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ సేల్స్ షోరూమ్కు మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు చేరుకున్నారు. రూ.150 కోట్లతో 106 ఎకరాల్లో నిర్మించనున్న టాయ్స్ పార్కుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమలను సందర్శించారు. అక్కడి నుంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మళ్లీ పలు పరిశ్రమలను సందర్శించారు. ఆ తర్వాత పార్కులో ఉత్పత్తి చేసిన వివిధ రకాల స్టాల్స్, చేతి వృత్తులతో తయారు చేసిన వస్తువులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించారు. చివరగా పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్నారు. ఇలా.. ఏకకాలంలో విసుగు లేకుండా వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు.
ఆకట్టుకున్న ఎగ్జిబిషన్
ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. స్వయంగా మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఒక్కో స్టాల్ దగ్గరికి నేరుగా వెళ్లి తిలకించారు. పారిశ్రామికవేత్తలు, అధిపతులతో స్వయంగా మాట్లాడారు. పరిశ్రమలకు అనుమతులు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
బిజినెస్ ఎలా నడుస్తుందో ఆరా తీశారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్లాస్టిక్, గ్లాస్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్, ఫీడ్స్, టెక్స్టైల్ తదితర స్టాల్స్ బాగున్నాయి. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతోపాటు సాధారణ జనం సైతం ఎగ్జిబిషన్ను తిలకించేందుకు బారులుదీరారు.
ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రీన్ పార్కులో ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రులు, విప్, కలెక్టర్ సన్మానం చేశారు. బొమ్మగోని మల్లేశ్ గౌడ్, హమీద్, మువ్వ రమేశ్, సునీతారెడ్డి, యాదగిరిరావు, చింతకింది మల్లేశం, స్వామిగౌడ్, జలంధర్ రెడ్డి, రంగారావు, చందుకుమార్, తరుణ్రెడ్డి, వర్కాల విజయలక్ష్మి, వెంకట్ను శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు.
ఇటీవల మృతిచెందిన కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు నేత కార్మికుల కుటుంబాలకు చేనేత బీమా చెక్కులు అందజేశారు.