పాలకవీడు, డిసెంబర్22 ;ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాసంగిలో ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. వానకాలంలో వరికి మంచి ధర రావడంతో యాసంగిలో వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. కాల్వ నీళ్లు లేకున్నా బోర్లు, బావుల ద్వారా సాగు చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా బోర్లు వేస్తున్నారు. బావుల్లో పూడిక తీస్తున్నారు. పాలకవీడు, నేరేడుచర్ల మండలాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న బోర్ మిషన్లే నిదర్శనం. భూగర్భ జలాలు అడుగంటినా రైతులు ఖర్చుకు వెనుకాడకుండా నీళ్లు పడేదాకా బోర్లు వేస్తున్నారు. రానున్న పంటల దిగుబడే తమను కాపాడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారే ఇలా..
కేసీఆర్ హయాంలో వరుసగా 18 సార్లు సాగర్ ఆయకట్టుకు నీరు వదలడంతో రైతులు ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం పండుగలా చేసుకొన్నారు. గత వానకాలం ప్రాంరంభంలో నీటి విడుదల జరుగకున్నా నాటి నమ్మకంతో రైతులు వరిసాగు చేపట్టారు. తీరా ఎండిపోయే పరిస్థితి వచ్చేనాటికి ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో వేలాది ఎకరాల్లో పంట చేతికి వచ్చింది. దీనికి తోడు ధాన్యానికి వానకాలంలో సన్న రకానికి చెందిన వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.2,600 నుంచి రూ.3,200 ధర పలికింది. ఈ నేపథ్యంలో ఈ యాసంగి సాగు చేసేందుకు తమకున్న పంట పొలాల్లో నీటి లభ్యతను పెంచుకోవడం కోసం రైతులు విరివిగా బోర్లు వేయించుకొంటున్నారు. దీంతో పలు గ్రామాల్లో బోరు బండ్లు విరివిగా కన్పిస్తున్నాయి.
భారీగా తగ్గనున్న వరి సాగు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత వానకాలంలో 4.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది యాసంగి సాగుకు నీటి విడుదల చేయడానికి అవకాశాలు లేకపోవడంతో భారీగా వరి సాగు విస్తీర్ణం తగ్గనుంది. జిల్లాలో వానకాలంతో పోలిస్తే లక్ష ఎకరాల్లో వరిసాగు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వానకాలంలో పాలకవీడు మండలంలో 17,251 ఎకరాల్లో వరిసాగు కాగా యాసంగిలో 11 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.
బావుల్లో పూడిక తీత, కొత్తగా బోర్లు
ఈ యాసంగికి కాల్వ ద్వారా సాగర్ నీటి విడుదల లేకపోవడంతో రైతులు ఉమ్మడి నేరేడుచర్ల మండలంలో సాగునీటికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పంట సాగు కోసం కాలానికి ఎదురీదుతూ ఎడాపెడా బోర్లు వేస్తున్నారు. పాత బావుల్లో సైతం ఖర్చుకు వెనుకాడకుండా పూడికలు తీయిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎస్కవేటర్లు, ఆధునిక యంత్రాలను సైతం రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. బావుల పూడిక తీతకు గంటకు రూ.4,000 నుంచి 4,500 వరకు వసూలు చేస్తున్నారు. చిన్న బావులైతే 2 నుంచి 4గంటల సమయం, పెద్ద బావులైతే 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఒక్కో రైతు సుమారు రూ.15 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు.
అశాస్త్రీయ పద్ధతులే దిక్కు
తమ పొలాల్లో నీటి లభ్యత పెంచడం కోసం రైతులు విరివిగా బోర్లు వేస్తున్నారు. బోర్లు వేయడానికి ముందు నీటి లభ్యతకు అనువైన ప్రదేశం ఎంచుకోవాలి. కానీ జియాలజిస్ట్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు అశాస్త్రీయ పద్ధతులను నమ్ముకుంటున్నారు. కొబ్బరికాయలు చేతిలో పెట్టుకొని బోర్ పాయింట్లు చూపించుకుంటున్నారు. ఒక్కో బోర్ పాయింట్ చూసినందుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు చెల్లిస్తున్నారు. రైతులు బోర్లు అధికంగా వేస్తుండడంతో బోర్ మిషన్ యజమానులు రేట్లు పెంచుతున్నారు. డ్రిల్లింగ్ అడుగుకు రూ.90 నుంచి రూ.100, కేసింగ్కు రూ.350 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క బోర్ వేసేందుకు రైతులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతున్నది. వీటికి తోడు విద్యుత్ మోటర్, పైప్లైన్ కోసం మరో రూ.50 వేల నుంచి రూ.70 వరకు అవుతున్నది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
గతంలో ఉమ్మడి నరేడుచర్ల మండలంలో బోర్లు 40 నుంచి 50 అడుగుల లోపు బోర్లు పడేవి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ నేపథ్యంలో బోర్లు 60 నుంచి 300 అడుగుల వరకు వేస్తున్నారు. 600 అడుగుల వరకు బోర్లు వేసే సామర్థ్యం గల యంత్రాలు ఉండడంతో నీళ్ల కోసం ఎంతో లోతుకైనా వేయడానికి రైతులు వెనుకాడడం లేదు.
వరికి మంచి ధర ఉండడంతోనే బోర్లు వేస్తున్నాం..
వానకాలంలో పండిన వరికి మంచి ధర పలుకడంతో యాసంగిలో ఎంత ఖర్చయినా సరే పంట సాగు చేయాలనుకున్నారు. దాంతో కొత్తగా బోర్లు వేస్తున్నాం ఈ ఏడాది నాకున్న పొలంలో రెండు కొత్త బోర్లు వేయించిన, లక్ష రూపాయల వరకు ఖర్చు అయినాయి. అయినా పంట పండిస్తే మంచి ధర వస్తుందని నమ్మకం ఉంది.
-యరెడ్ల సత్యనారాయణరెడ్డి, రైతు
బోర్లు వేయించుకునే రైతుల సంఖ్య పెరిగింది
గతంలో కొద్దిమంది పెద్ద రైతులు మాత్రమే బోర్లు వేయించుకునే వారు. ఈ యాసంగి సాగులో చిన్న రైతులు కూడా ఎక్కువగా బోర్లు వేయించుకుంటున్నారు. గతంలో ఈ సీజన్లో ఒక్కో మండలంలో 20 నుంచి 30 బోర్లు వేసే వాళ్లం. ఇప్పుడు 60 నుంచి 100 బోర్లు వేస్తున్నాం. బోర్లు వేయించుకునే వారి సంఖ్య పెరుగడంతో తీరిక లేకుండా పనిచేస్తున్నాం.
– వెంకన్న, బోర్వెల్ యజమాని