సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పార్టీ నుంచి పిలుపు ఇవ్వకపోయినా అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బీజేపీ, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కవిత అరెస్టును మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తీవ్రంగా ఖండించారు. సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో జనగాం క్రాస్ రోడ్డు వద్ద జాతీయరహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. అర్వపల్లి మండలకేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి జిల్లా కేంద్రం, అడ్డగూడూరు, మోత్కూరులో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. భువనగిరిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ నేడు గ్రామాలు మొదలుకొని అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్ నల్లజెండాలతో శాంతియుత ధర్నాలు, నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునివ్వగా.. ఆ మేరకు శ్రేణులు సిద్ధమవుతున్నారు.
అర్వపల్లి, మార్చి 15 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ను నిరసిస్తూ అర్వపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై శ్రేణులు శుక్రవారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలను మిన్నంటించారు. బీజేపీ నీచ రాజకీయలను ప్రజలు గమనిస్తున్నారని, తిరగబడక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, నాయకులు బైరబోయిన రామలింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కడారి నరేశ్, దుబ్బాక ఎల్లంరాజు, లొడంగి లింగరాజు, సుంకరి వెంకన్న, పులిచర్ల ప్రభు, మాగి పరమేశ్, పొట్టపాక సైదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నీలగిరి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోదీ ఏజెంట్ సంస్థలు అరెస్టు చేయడం అప్రస్వామికమని ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని బీఆర్ఎస్ మహిళా విభాగం ఉమ్మడి జిల్లా కన్వీనర్, ఐసీడీఎస్ మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పనిచేసిన కల్వకుంట్ల కవితను అక్రమ కేసులో ఇరికించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మద్యం కేసులో ఎన్నో సార్లు విచారణకు పిలిచి మెకు సంబంధం లేదని చెప్పినా, ఎన్నికల నేపథ్యంలో అరెస్ట్ చేయడం సరికాదని, మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
శాలిగౌరారం /మాడ్గులపల్లి : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అప్రజాస్వామికం అని శాలిగౌరారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, బీఆర్ఎస్ రా్రష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర పన్నుతుందని, ఈవిషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, గుండా శ్రీనివాస్, చిరబోయిన శ్రీనివాస్, పడాల సత్తయ్య, దాసరి వెంకన్న ఉన్నారు.