భువనగిరి అర్బన్, మే 2 : ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖాన అంటే.. నేను రాను బిడ్డో… అంటూ రోగులు కండ్ల నీళ్లు తీసిన దుస్థితి. నాటి పాలకుల నిర్లక్ష్యం, వసతుల లేమి అందుక్కారణం. నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలు సకల సౌలత్లు సమకూర్చుకుని అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మంగళవారం భువనగిరి జిల్లాకేంద్ర దవాఖానకు వచ్చి చెవి సంబంధిత చికిత్స తీసుకుని సర్కారు వైద్యంపై రోగుల్లో మరింత నమ్మకాన్ని పెంచారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దిందని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. చెవి సంబంధిత సమస్యతో మంగళవారం భువనగిరి ఏరియా దవాఖానకు వెళ్లిన ఆమెకు వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు, ఓపీల సంఖ్య పెరిగిందన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు అందించడంతోపాటు ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరుస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ కిట్ ద్వారా పుట్టిన ప్రతి బిడ్డకూ అవసరమైన వస్తువులు అందిస్తున్నారన్నారు. డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.