పెన్పహాడ్, సెప్టెంబర్ 01 : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశ వర్కర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీల బాధ్యత ఆశా వర్కర్లే తీసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణుల వద్దకు వెళ్లి బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా, సహజ కాన్పుకు ఫిజికల్ యాక్టివిటీస్పై అవగాహన కల్పించాలన్నారు. దవాఖాన ఆవరణ పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో వెంటనే శుభ్రం చేయించాలని డాక్టర్ రాజేష్ ను ఆదేశించారు.
ప్రస్తుతం అంటు వ్యాధులు, వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. పీహెచ్సీలలో 100 శాతం ప్రసూతి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోయినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేష్ . ఆశ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబలైజర్ ఉపేందర్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సైదమ్మ, ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రీనివాసులు, ప్రభాకర్, హెల్త్ సూపర్వైజర్ పూలమ్మ, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్ లు ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.