Vasalamarri | రెక్కాడితే గానీ డొక్కాడని ధైన్యం. ఏదో దొరికిన పనితో కూలినాలి చేసుకునే దుస్థితి. కుటుంబాన్ని ఏ పూటకు ఆ పూట వెళ్లదీసే దీనగాథ వారిది. అనేక సందర్భాల్లో అప్పుల పాలై కుటుంబాలే ఆగమైన దయనీయ సంఘటనలు.. ఇవన్నీ దళిత వాడల్లో ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అది మారింది. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన దళిత బంధుతో ఎస్సీల దశ తిరిగింది. దళితుల జీవితాలు మారిపోయాయి. ఇందుకు ఉదాహరణే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామం.
– యాదాద్రి భువనగిరి, జూలై 1 (నమస్తే తెలంగాణ)
రూ.10 లక్షల ఆర్థిక సాయం
రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీల అభ్యున్నతి కోసం దూరదృష్టితో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తొలి విడుత సమర్థంగా అమలు చేసింది. ఇప్పుడు రెండో విడుతలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
వాసాలమర్రిలో మారిన దళితుల జీవితాలు
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా దళిత బంధు స్కీమ్ను ఇక్కడే పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. గ్రామం మొత్తం సర్వే చేయించారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు 75మందిని గుర్తించారు. దీంతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఇక్కడే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతే హుజూరాబాద్లో మొదలు పెట్టారు. ప్రభుత్వం అందించిన సాయంతో వాసాలమర్రిలోని లబ్ధిదారులు ఇప్పుడు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు.
వెల్డింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్, కిరాణా, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, క్లాత్ షోరూమ్, టీ కప్పుల తయారీ, సెంట్రింగ్ తదితర బిజినెస్లు ఏర్పాటు చేసుకుంటూ విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో రూ.10 నుంచి రూ.15వేలకు ఒకరి కింద పనిచేసిన వారే ఇప్పుడు గర్వంగా యజమానిగా బతుకుతున్నారు. నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో హైదరాబాద్లో రూ.15వేలకు పనిచేసి, రెంట్లు, ఇతర ఖర్చులకే పోయేవని.. ఇప్పుడు సొంత ఊరిలో మంచి ఆదాయం పొందుతూ ఆనందంగా బతుకుతున్నామని వాసాలమర్రి దళితబంధు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అప్పులు ఇప్పుడు తీరుస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కొందరైతే ఏకంగా ముగ్గురు, నలుగురికి పని కల్పిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరికి నెలకు రూ.15వేల వరకు జీతాలు చెల్లిస్తుండటం విశేషం.
నెలకు రూ.25లక్షల టర్నోవర్
వాసాలమర్రిలో దళిత బంధు యూనిట్ వచ్చింది. ఈ పథకం కింద సర్కారు రూ.10లక్షల సాయం చేసింది. దీంతో భువనగిరిలో కిరాణం, మెడికల్ సామాను హోల్సేల్ సప్లయ్ డీలర్షిప్ తీసుకున్న. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు వస్తువులు సప్లయ్ చేస్తున్న. బిజినెస్ రోజురోజుకూ పెరిగి మంచి ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం నెలకు రూ.25లక్షల దాకా బిజినెన్ టర్నోవర్ నడుస్తున్నది. ఖర్చులన్నీ పోను రూ.50వేల దాకా చేతికి వస్తున్నాయి. ఇప్పుడు నా కింద నలుగురికి ఉపాధి లభిస్తున్నది. దళితబంధు ఎంతో ఆసరా అయ్యింది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను చూశాం గానీ.. దళితుల కోసం ఇంతలా తపన పడిన సీఎంను చూడలేదు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– బత్తుల రాజేశ్, దళితబంధు లబ్ధిదారుడు, వాసాలమర్రి
బొలెరో కిరాయికి నడుపుతున్నా
గతంలో డ్రైవర్గా పనిచేసిన. ఒకరి కింద పనిచేస్తే.. మనకు కోపం వచ్చినా, వారికి కోపం వచ్చిన మనకే ఇబ్బంది. అప్పుడు హైదరాబాద్లో నేను రూ.15వేల జీతానికే పనిచేసిన. వచ్చిన పైసలన్నీ రెంట్లు, ఖర్చులకే సరిపోయేవి కాదు. పైగా అప్పులయ్యేవి. ఇప్పుడు దళితబంధుతో బొలెరో వాహనం కొన్న. మంచిగ నడుస్తున్నది. నెలకు రూ.50వేలు మిగులుతున్నయి. దళితబంధుతో అప్పుడు చేసిన అప్పులు తీర్చడంతోపాటు ఇంకొన్ని కలేసి చెల్లి పెళ్లి కూడా చేసినం. మా దళితులను గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. ఓటు బ్యాంక్గానే చూశాయి. కానీ.. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఎస్సీల కోసం ఎన్నో స్కీమ్లు తీసుకొచ్చినరు.
– చెన్నూరు కైలాసం, దళితబంధు లబ్ధిదారుడు, వాసాలమర్రి
నాతోపాటు మరో నలుగురికి ఉపాధి..
నేను గతంలో హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేసిన. నెలకు రూ.15వేల వరకు జీతం వచ్చేది. రోజూ వచ్చిపోయేందుకే రూ.6వేల దాకా ఖర్చులు అయ్చేవి. వచ్చిన జీతంలో పెద్దగా మిగిలేది కావు. సీఎం కేసీఆర్ ఇచ్చిన దళిత బంధుతో వెల్డింగ్ షాపు పెట్టిన. సాధారణ వెల్డింగ్ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన. నాకు నైపుణ్యం ఉంది. ఇప్పుడు మంచి కాంట్రాక్టులు వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్లి పని చేస్తున్న. మిషన్లు మొత్తం వెంట తీసుకెళ్తాం. నాతోపాటు నలుగురికి పని కల్పిస్తున్న. అన్ని ఖర్చులుపోను నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తుంది. సీఎం కేసీఆర్ గొప్ప మనిషి.
– కొండాపురం నగేశ్, దళితబంధు లబ్ధిదారుడు, వాసాలమర్రి
సొంతంగా ల్యాబ్ నడిపిస్తున్నం
గతంలో హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసేది. ఆ తర్వాత తుర్కపల్లి మండలంలోని మాదాపూర్లోని ఓ ల్యాబ్లో పనిచేసిన. అప్పుడు నెలకు రూ.15వేల జీతం వచ్చేది. దళిత బంధు వచ్చాక మా ఊరు పక్కనే ఉన్న మాదాపూర్లోనే డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసుకునే అవకాశం దొరికింది. హాస్పిటల్లోనే సొంతంగా ల్యాబ్ నడిపిస్తున్నం. ఇప్పుడు నెలకు రూ.30వేలకు పైనే మిగులుతున్నాయి. ఉన్న చోటనే పనిచేసుకుంటుండటం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ చలువతోనే ఇది సాధ్యమైంది. కేసీఆర్ సార్కు స్పెషల్ థ్యాంక్స్.
– బొట్టు లత, ల్యాబ్ టెక్నీషియన్, వాసాలమర్రి