ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. గౌరమ్మను పూజించి ఆడబిడ్డలంతా ఆటపాటలతో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. లయబద్ధంగా సాగే పాటలు, చప్పట్లతో ఊరువాడ మార్మోగగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో పండుగ శోభ ఉట్టిపడింది. రెండేండ్ల తర్వాత జనం భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడడంతో వీధులన్నీ పూల జాతరలా మారాయి. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 25 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలపూల వేడుకలను మహిళామణులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆడబిడ్డలంతా ఉదయం నుంచే తంగేడు, జిల్లేడు, బంతి, చామంతి, గునుగు, సీతజడ తదితర పూలు సేకరించి బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, ఆలయాల ఆవరణల్లో బతుకమ్మలను ఉంచి ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ’ అంటూ తీరొక్క పాటలతో రాత్రి పది గంటల వరకు ఆడిపాడారు. ఆ తర్వాత సమీప చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మంగళహారతులు పట్టారు. ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, ఈ వేడుకలు తొమ్మిదిరోజులపాటు జరుగనున్నాయి.