రామగిరి, మే 12 : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బాధితులను స్టేషన్లోనే ఉంచి, ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని తెలిపారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపైనే ‘హనీ ట్రాప్’ కేసు పెట్టే వరకు పోలీసులు వేచి చూసి, ఆ తర్వాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బేటీ బచావో’ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల నుండే మహిళలకు, బాలికలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన హత్రాస్, ఉన్నావో కేసుల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎలాగైతే నిందితులను కాపాడే ప్రయత్నం చేశాయో, ఇప్పుడు ఇక్కడ అదే ధోరణి కనిపిస్తోందన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు నిందితులకు కొమ్ముకాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి, బాధితురాలికి రక్షణ కల్పించాలని ఐద్వా నల్లగొండ పట్టణ కమిటీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.