ఎన్నికల షెడ్యూల్ వెలువడినా విపక్ష పార్టీలు అభ్యర్థులను తేల్చుకోలేకపోతుంటే భారత రాష్ట్ర సమితి టాప్ గేర్లో దూసుకుపోతున్నది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా పార్టీ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో తనదైన శైలితో బీఆర్ఎస్ను ఎన్నికల కదనరంగంలో నడిపిస్తున్నారు. ఆగస్టు 21న ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి అభ్యర్థులుగా ప్రకటించి సమరానికి సై అన్నారు. ఇక పార్టీ అభ్యర్థులందరికీ ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ బీ-ఫారాలు అందించనున్నారు. ఆ మర్నాడే తెలంగాణ ఉద్యమ గడ్డ భువనగిరి నుంచి సమరశంఖారాన్ని పూరించనున్నారు. తర్వాత ఈ నెలాఖరుకే మరో ఏడు నియోజకవర్గాల్లో సభలకు షెడ్యూల్ ప్రకటించారు. మరోవైపు పార్టీలో సమన్వయం కోసం ఐదు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్చార్జిలను సైతం ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులంతా విస్తృతంగా ప్రజలతో మమేకం కాగా ఇక నుంచి నియోజకవర్గంలోని ప్రతి ఇంటినీ తట్టేలా, ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గ్రామగ్రామాన ప్రచారాన్ని హోరెత్తించడమే తరువాయి కానున్నది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయి ఎన్నికల కోలామలం నెలకొంది. వచ్చే నెల 30న జరుగనున్న పోలింగ్ సమరంలో విజయం సాధించేలా అడుగులు వేస్తున్నారు. తనదైన వ్యూహం, పక్కా ప్రణాళికలతో అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్నే సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వరాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు గులాబీ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ 12కు 12 స్థానాల్లో మరోసారి జయకేతనం ఎగురవేసేలా దిశానిర్దేశం చేస్తూ అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించారు. అప్పటి నుంచే ప్రచారం చేపట్టగా.. ఇప్పటికే ఒక దఫా నియోజకవర్గాన్ని దాదాపుగా చుట్టేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. ఇందులో భాగంగానే సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సభలకు భారీగా జనాలు తరలి రావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. అభ్యర్థుల ప్రకటన నాటి నుంచి పార్టీ శ్రేణులన్నీ ఎన్నికల సమరంలోకి దిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల సమరంలోకి దూకిన బీఆర్ఎస్.. గురువారం ఐదు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది. నల్లగొండకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్కు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కోదాడకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నాగార్జున సాగర్కు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, హుజూర్నగర్కు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డిని నియమించారు. వీరు పార్టీలో సమన్వయంతోపాటు ప్రచార సరళిపై దృష్టి సారించనున్నారు. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల నేతలను మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆహ్వానించనున్నారు. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నేత కేతావత్ బిల్యానాయక్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. హుజూర్నగర్లో మేళ్లచెర్వు నేత జిల్లేపల్లి వెంకటేశ్వర్లు గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆలేరులో పీసీసీ మాజీ కార్యదర్శి చామల ఉదయ్చందర్రెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరందరూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఇదే సమయంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నల్లగొండలో చకిలం అనిల్కుమార్ కూడా మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించక ముందే బీఆర్ఎస్ అన్ని కోణాల్లో ఎన్నికల సమరంలోకి దూకింది. రానున్న రోజుల్లో మరింత టాప్ గేర్లో దూసుకుపోయేందుకు అస్త్రశస్ర్తాలతో ముందుకు సాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి అడ్డాగా పేరొందిన భువనగిరి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల సమర శంఖరావం పూరించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2గంటలకు భువనగిరిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నేతృత్వంలో జరుగనున్న సభలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇక్కడి నుంచి మొదలయ్యే సీఎం కేసీఆర్ ప్రచారం ఈ నెలాఖరు నాటికే 8 నియోజకవర్గాల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడులో జరిగే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. 29వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల మధ్యలో ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో జరిగే సభలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ నెల 31న మరో మూడు నియోజకవర్గాలు హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో గంటకో సభ చొప్పున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు పాల్గొంటారు. సూర్యాపేట, నకిరేకల్, నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో నామినేషన్ల తర్వాత కేసీఆర్ సభలు జరుగనున్నాయి.
ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలో సవాల్ విసిరిన సీఎం కేసీఆర్ భీ-ఫామ్ల అందజేతలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులందరికీ ఈ నెల 15న తెలంగాణ భవన్లో భీ-ఫారాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అభ్యర్థులంతా అక్కడ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదేరోజు సీఎం కేసీఆర్ హుస్నాబాద్ బహిరంగ సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. కొద్దిరోజులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారంటూ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ వర్గాలతోపాటు సర్వత్రా బీఆర్ఎస్ మేనిఫెస్టోపై అమితాసక్తి నెలకొంది.