ఆత్మకూర్.ఎస్, మే 16 : జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూర్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య రెడ్డి మాట్లాడుతూ సమాజంతో మమేకమై -డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. డెంగ్యూ వైరస్ వ్యాధిని హాని కలిగించే ఎడిస్ ఇజాప్ట్టై (టైగర్) దోమ మన ఇంటి పరిసరాలలో చిన్న చిన్న పాత్రలలో స్థావరం ఏర్పాటు చేసుకొని పగటి పూట కుట్టడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాల్లో లార్వా (తొక పురుగులు) లేకుండా చేసుకోవాలని, దోమ తెరలు వాడాలని, కిటికీలకు జాలిలు బిగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, సూపర్వైజర్ భూతరాజు సైదులు, నర్సింగ్ ఆఫీసర్ మానస, ఫార్మసీ ఆఫీసర్ జానకి, ల్యాబ్ టెక్నీషియన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.