ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 28 : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార పరీక్ష ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను సేకరించే విధానాన్ని తెలిపారు. రైతులు తమ భూముల ఉత్పాదకతను పెంచుకోవాలంటే మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సమగ్ర ఎరువుల వినియోగంలో భాగంగా పచ్చి రొట్టె ఎరువులు (Green Manuring) వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. పచ్చి ఎరువుల వల్ల భూమి సారవంతం పెరగడం, నేల నిర్మాణం మెరుగుపడడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి.దివ్య, వ్యవసాయ విస్తరణ అధికారి పి.శివమూర్తి, గ్రామ రైతులు పాల్గొన్నారు.