మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున మిర్యాలగూడలోని చింతపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు దగ్గరలో గల కామేపల్లి పట్టణం నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు సోమవారం రాత్రి 9 గంటలకు 40మందితో హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్యలో కొండేపి వద్ద ముగ్గురు, ఉల్వలపాడు వద్ద మరో ఇద్దరిని ఎక్కించుకున్నారు. బస్సులో సీట్లు లేకపోవడంతో డ్రైవర్ వెంకటేశ్వర్రావు తన క్యాబిన్లో ఐదుగురిని కూర్చో బెట్టుకున్నాడు.
బస్సు ప్రారంభం నుంచే అధిక వేగంతో వెళుతుందని కొందరు ప్రయాణికులు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిన వినకుండా వేగంగా వెళ్తుండడంతో ఒక వాహనదారుడు బ్రాహ్మణ పల్లి టోల్ గేట్ వద్ద డ్రైవర్ను హెచ్చరించాడు. అయినప్ప టికీ లెక్క చేయకుండా డ్రైవర్ అదే వేగాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆర్ధరాత్రి 2.40 సమయంలో హైద్రాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ పంక్చర్ కావడంతో టైర్ను మార్చేందుకు లారీని డ్రైవర్ మిర్యాలగూడ పట్టణం చింతపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్బంక్ వద్ద రోడ్డు పక్కకు ఆపి ఉంచాడు. అదే సమయంలో అతి వేగంగా వస్తున్న బస్సు ఓ కంటైనర్ లారీని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కొండేపికి చెందిన మల్లికార్జున్(40), వినుకొండ మండలం నాగులారం గ్రామానికి చెందిన జయరావ్(42), గుంటూరుకు చెందిన నాగేశ్వర్రావు(44)లు క్యాబిన్లో ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
అదే క్యాబిన్లో చంటి పిల్లలతో కూర్చున్న ఇద్దరు తల్లులు తీవ్రంగా గాయపడగా చంటిపాపలు సురక్షితంగా బయటపడ్డా రు. వీరితో పాటు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్యాబిన్లో కూర్చున్న వ్యక్తులంతా వలసకూలీలే. సమాచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హూటాహుటిన స్ధానిక ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.
తాపీ పనులు చేసుకునే మేము రాఖీ పండుగ కోసం మా గ్రామానికి వెళ్లాం. పండుగ అయిపోయిన తర్వాత తమ కుటుం బంతో హైద్రాబాద్కు బయలుదేరాం. బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ క్యాబిన్లోనే కూర్చున్నాం. డ్రైవర్కు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. అయిన వినకుండా వేగంతో వెళ్లడంతో క్షణకాలంలో ఏమి జరిగిందో ఆర్ధం కాలేదు. నా దగ్గర చంటి పాప ఉండగా, 5 సం వత్సరాల బాబుతో నా భర్త ఉన్నాడు. ప్రమాద సమయంలో పిల్లలు ఇద్దరు సీటు కిందకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం నుంచి భయట పడ్డాం. నా భర్తకు, నాకు తీవ్రంగా గాయాలయ్యాయి.
మేము ఒరిస్సా నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఒంగోలులో బంధు వుల ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్కు బయలుదేరాం. 5 నెలల పసిపాపతో నేను క్యాబిన్లో కూర్చున్నా. నిద్రలో ఉం డడం వల్ల ఏమి జరిగిందో తెలియదు. మా పాప ఆదురుకుని స్పృహ తప్పింది. దవఖానకు వచ్చిన తర్వాత డాక్టర్లు చూడడంతో ఏమి కాలేదు.
వినుకొండ దగ్గరలోని నాగులారం గ్రామం మాది. చౌటప్పల్ దగ్గర ఒక పత్తి చేనులో జీతానికి ఉంటున్నాం. 20 రోజుల కిందట మా ఉరుకు వచ్చి చౌటప్పల్కు వెళుతున్నాం. మేము క్యాబిన్లో కూర్చోవడంతో ప్రమాదంలో నా భర్త జయరావ్ తలకు బలమైన గాయం కావడంతో మరణించాడు. నా రెండు చేతులకు దెబ్బలు తగిలాయి. బతుకుదెరువు కోసం పోతున్న మాకు బతుకే లేకుండా పోయింది.