రామగిరి, జూన్ 1 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆ దిశగా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు స్వరాష్ట్రంలో పెద్ద పీట వేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ గావిస్తున్న దేశంలోనే ఏకైక మహోన్నత ఆధ్యాత్మిక దార్శనికుడు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని యజ్ఞయాగాదులు చేస్తూ సంప్రదాయాలకు జీవం పోస్తూ స్వరాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చారు. బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుతూ సనాతన ధర్మం కోసం పాటుపడుతూ ఆధ్యాత్మికత విషయంలో దేశంలో ఆయనతో పోటీపడే వ్యక్తి ఎవరూ లేరని చెప్పవచ్చు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు 010 పద్దుతో నెలనెలా వేతనాలు అందిస్తూ.. పేద బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమానికి, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
అంతేకాకుండా పురాతన ఆలయాల్లో నిత్యం ఆధ్యాత్మికత విలసిల్లేలా ధూప, దీప, నైవేద్య స్కీం (డీడీఎన్ఎస్) కింద గత పాలకులు రూ.2500 అందించగా దానిని స్వరాష్ట్రంలో రూ.6వేలకు పెంచి వాటిల్లో పనిచేసే అర్చకులకు ఆర్థిక భోరసా కల్పించారు. తాజాగా రూ.10వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంపై బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించేలా హైదరాబాద్ గోపన్పల్లిలో రూ.12కోట్లతో సర్వాంగ సుందరంగా నిర్మాణం చేసి బుధవారం విప్రహిత బ్రాహ్మణ సదనం (భవనం) ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్ వారికి మరిన్ని వరాలు ప్రకటించారు. వేద పండితులకు గౌరవ భృతిని రూ.5వేలకు పెంచగా, అర్హత వయస్సును 65 ఏండ్లకు తగ్గించారు. ఇలాంటి వ్యక్తి ధర్మ సంస్థాపన చేస్తూ దేశంలోనే బ్రాహ్మణ పక్షపతిగా నిలుస్తున్నారని ధార్మిక వేత్తలు పేర్కొంటున్నారు.
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం.. అర్చకులకు భరోసా
గత పాలకుల హయాంలో ఆదరణ లేక మూలనపడ్డ ఆలయాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం సంతరించుకున్నాయి. అదేవిధంగా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2500నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. ధూప, దీప నైవేద్య పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,675 దేవాలయాలు ఉన్నాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 410 దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు గత పాలకులు రూ.2500 గౌరవ భృతి ఇవ్వగా.. స్వరాష్ట్రంలో రూ.6వేలకు పెంచారు. తాజాగా రూ.10వేలకు పెంచుతూ బుధవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరో 320 దేవాలయాల్లో డీడీఎన్ఎస్ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు లబ్ధి చేకూరనుంది.
బ్రాహ్మణులకు సముచిత స్థానం
అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తున్న విధంగానే బ్రాహ్మణులకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బ్రాహ్మణుల ఆడపిల్లల వివాహానికి ప్రత్యేక నిధులు, బ్రాహ్మణుల పిల్లలకు విదేశీ విద్య, వ్యాపారం చేసుకొనే బ్రాహ్మణులకు పారిశ్రామిక ప్రోత్సాహం అందిస్తున్నారు. అర్చక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 010 పద్దుతో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందించంతో బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కలిగింది.
బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్లోని గోపన్పల్లిలో తొమ్మిది ఎకరాల్లో రూ.12కోట్లతో సర్వాంగ సుందరంగా నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. వేదశాస్త్ర పండితులకు అందించే గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. గౌరవ భృతి అందించే వేద శాస్త్ర పండితుల వయస్సును 75నుంచి 65ఏండ్లకు తగ్గించారు. వేద పాఠశాలకు రూ.2లక్షల వార్షిక గ్రాంట్ ఇస్తామన్నారు. ఐఐఎం, ఐఐటీల్లో చదివే బ్రాహ్మణులు, అర్చకుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు, అనువంశిక అర్చకుల సమస్యలపై కేబినెట్లో చర్చ చేస్తామని చెప్పారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి వెలకట్టలేనిది
బ్రాహ్మణుల మేలు కోసం సీఎం కేసీఆర్ చొరవ వెలకట్టలేనిది. ధూప, దీప, నైవేధ్య పథకం వేతనం రూ.6వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడం హర్షణీయం. బ్రాహ్మణ నిరుపేదల విద్యాభివృద్ధికి బ్రాహ్మణ పరిషత్ ద్వారా రుణ సదుపాయం, వేద బ్రాహ్మణుల భృతిని పెంచుతున్నట్లు ప్రకటించడం చారిత్రాత్మకం. బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురువుల పట్ల గౌరవ భావం అనితర సాధ్యం. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్కు బ్రాహ్మణ సమాజం రుణపడి ఉంటుంది. భారత దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశవ్యాప్తంగా సబ్బండ వర్గాలకుసేవలందించాలని ఆశీర్వదిస్తున్నాం.
– గుదె లక్ష్మీనర్సయ్య శర్మ, ధూప, దీప, నైవేద్య పథకం రాష్ట్ర సలహాదారు, తుమ్మడం గ్రామం (నిడమనూరు)
ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్ను రూపకల్పన చేసి, శిథిలమైన గ్రామీణ దేవాలయాలకు పూర్వవైభం తెచ్చి ధూప, దీప, నైవేద్య పథకం అమలుతో పేద బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్. 14 ఏండ్లపాటు గాంధేయ మార్గంలో అందరినీ ఐక్యం చేసి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగాలని నిత్యం బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో అయుత చండీయాగం, హోమం నిర్వహించి ప్రజా శాంతి కోసం పాటుపడిన వ్యక్తి. యాదగిరిగుట్ట, కాళేశ్వరం, వేములవాడతోపాటు రాష్ట్రంలో పలు ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సుందరీకరణ చేశారు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే మంచి జరుగుతుందని ఆ దిశగా మంచి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమనికి అదే స్థాయిలో ప్రత్యేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. డీడీఎన్ఎస్లో అర్చకులకు వేతనం రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచిన మనసున్న మహానుభాహుడు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు 010 పద్దుతో ప్రతి నెలా వేతనాలు ఇస్తుండడం సంతోషకరం. పేద బ్రాహ్మణ ఆడపిల్లల వివాహానికి, విద్యార్థుల విదేశీ విద్యకు, పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలకి కోరుకుంటున్నాం.
– పెన్నా మోహనశర్మ, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, డీడీఎన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు
అసలు సిసలైన హిందూ ధర్మ పరిరక్షకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి. రూ.1.100 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా అనేక ఆలయాల అభివృద్ధికి కృషి చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణుల సంక్షేమాన్ని కాంక్షించి అవసరమైన సహకారం అందిస్తున్నారు. సీఎం కేసీఆర్కు స్వతహాగానే గురువులపై, దేవుడిపై అపారమైన భక్తి విశ్వాసాలుంటాయనడానికి నిదర్శనం ఆలయాల నిర్మాణం, హిందూ పరిరక్షణ. ప్రతి నెలా అర్చకులకు జీతాలు సమయానికి ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రతి ఏటా రూ.100కోట్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తూ హైదరాబాద్లో విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బ్రాహ్మణులంతా మద్దతు తెలుపుతున్నారు.
– వాసుదేవశర్మ, ధూప, దీప, నైవేద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
తెలంగాణ రాష్ట్రంలోనే అర్చకులకు సరైన గౌరవం దక్కింది. ఒక్క తెలంగాణలోనే హిందూత్వం, సనాతన ధర్మం కాపాడబడుతుంది. గతంలో హిందూ దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు అంతంతమాత్రంగా జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకం కింద నెలకు రూ.6వేల చొప్పున ఇస్తున్నారు. దానిని రూ.10వేలకు పెంచుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అర్చకులకు గౌరవ వేతనం రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచడం హర్షించదగ్గ విషయం. అర్హత వయస్సును 65సంవత్సరాలకు తగ్గించినందుకు ధన్యవాదాలు. హిందూ రాజ్యమని సెంటిమెంట్ను వాడుకొని మతం ముసుగులో రాజకీయం చేసిన నాయకులున్నారు కానీ.. అర్చకుల ఆర్తనాదాలు విన్న నాయకుడు ఒక్క కేసీఆరే. ఐటీఎం, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం గొప్ప నిర్ణయం. సనాతన ధర్మ పరిరక్షకుడిగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, వైదిక క్రతువుల ఆచారకుడిగా, నిజమైన హిందువుగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. వారు మున్ముందు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
– శేశబట్టర్ నర్సింహాచార్యులు, రామాలయ పూజారి, నందిపహాడ్ (మిర్యాలగూడ టౌన్)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తెలంగాణలోని ఏ గ్రామంలో చూసినా దేవాలయాలు కళకళలాడుతూ హైందవ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గొప్పగా చాటుతున్నాయి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించే విధంగా విప్ర సేవ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం. బ్రాహ్మణ గౌరవ భృతిని 75 ఏండ్ల నుంచి 65 సంవత్సరాలకు తగ్గించి రూ.5వేలు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ధూప, దీప, నైవేద్య పథకానికి రూ.6వేల నుంచి 10వేలకు పెంచుతూ గ్రామీణ అర్చకులకు జీవనోపాధి కల్పించి దైవ సేవకు, బ్రాహ్మణ సేవకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. పండుగలు, పబ్బాల్లో బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ అయుత చండీయాగం, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు బ్రాహ్మణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన దేశ ప్రధాని కావాలని బ్రాహ్మణులమంతా పూజలు, యాగాలు చేపడుతాం.
– దుర్గి మురళీధర్శర్మ, అర్చకుడు, నకిరేకల్
ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడం హర్షణీయం
పురాతన దేవాలయాల్లో పనిచేస్తున్న అనువంశిక అర్చకుల హక్కులను పరిష్కరించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ హైదరాబాద్లో జరిగిన సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసే మహానుభావుడు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రంలో అర్చక, ఉద్యోగులకు 010 పద్దుతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ అందించని విధంగా బ్రాహ్మణ ఆడపిల్లల వివాహానికి నిధులు, బ్రాహ్మణ పిల్లల విదేశీ విద్యకు రూ.20లక్షల ఆర్థిక సహాయం, పరిశ్రమల ఏర్పాటుకు నిధులు అందించడం గొప్ప విషయం. వేద పండితులకు అందించే గౌరవ భృతిని రూ.5వేలకు పెంచడంతోపాటు అర్హత వయస్సును 65ఏండ్లకు తగ్గించడం సంతోషకరం.
– నాగోజు మల్లాచారి, దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ప్రధానార్చకుడు, మతైక అర్చక, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు (కనగల్లు)
రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్నది
గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు.. గోవులతోపాటు బ్రాహ్మణులు ఎక్కడ ఆరాధింపబడుతారో ఆ దేశం, ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు, వేదాల్లో చెప్పబడిన విధంగా అర్చకులు, పురోహితులు, వేద పండితులతోపాటు అందరికీ మంచి చేస్తున్న మనసున్న మూర్తి సీఎం కేసీఆర్. ప్రధాన దేవాలయాల్లోని అర్చకులకు గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్న గొప్ప ఆదర్శమూర్తి. చిన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేధ్య పథకం ద్వారా వేతనం ఇస్తున్న ప్రజ్ఞామూర్తి. బ్రాహ్మణులను గుర్తించి, మా బాగోగుల కోసం హైదరాబాద్లో బ్రాహ్మణ సదన్, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాం.
– తూమాటి బ్రహ్మచార్యులు, అనువంశిక అర్చకుడు, మట్టపల్లి దేవాలయం, మఠంపల్లి
తెలంగాణలోనే బ్రాహ్మణులకు సముచిత గౌరవం
దేశంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణలోనే బ్రాహ్మణులకు సముచితమైన గౌరవం దక్కింది. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల పక్షపాతిగా వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. మారుమూల గ్రామాల్లో సరైన ఆదరణ లేని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో నెలకు ఆరు వేల నుంచి పది వేల వరకు వేతనాలు పెంచడం అర్చకుల్లో ఆత్మైస్థెర్యం పెంచింది. ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలో బ్రాహ్మణులకు అన్ని రకాల సదుపాయాలు, పథకాలు అమలు చేయడం సంతోషకరం. బ్రాహ్మణ సదన్ భవనం, తెలంగాణలోని నిరుపేద బ్రాహ్మణుల అభివృద్ధికి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– పవన్కుమారాచార్యులు, రామాలయ అర్చకుడు, దామరచర్ల
ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి అమోఘం
నా చిన్నతనం నుంచి చూస్తున్నా.. దేవాలయాల గురించి కానీ, వాటిని పరిరక్షించేందుకు గానీ ఎవరూ ముందుకు రాలేదు. హైందవ సంప్రదాయాన్ని పెంపొందించి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా చిన్న దేవాలయాలు సైతం అభివృద్ధికి నోచుకున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న దేవాలయాలకు ధూప, దీప, నైవేధ్య పథకం ముందుకు సాగడానికి, దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘం. బ్రాహ్మణులకు పెద్ద భవనాన్ని నిర్మించడం ప్రశంసనీయం. ధూప, దీప, నైవేధ్య పథకానికి రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచడం గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్కు బ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– వావిలాల రామలింగయ్యశర్మ, అర్చకుడు, వల్లాల గ్రామం, శాలిగౌరారం మండలం