యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎప్పటిలాగానే బీజేపీ సభ వెలవెలబోయింది. ఏదో వచ్చామా.. కనిపించామా.. వెళ్లిపోయామా.. అన్నట్టుగా నేతలు నామ్కే వాస్తేగా సభను కానిచ్చేశారు. గోవా ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభలో కనీసం రెండు వేల మంది కూడా హాజరు కాలేదు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఓవరాల్గా బీజేపీ సభ చప్పగా సాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భువనగిరికి సంబంధించి భాగ్యలక్ష్మి క్లస్టర్ను ఏర్పాటు చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధితోపాటు మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనున్నది. తొలి రోజు భువనగిరి పట్టణంలో యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో సభను ఏర్పాటు చేశారు. దీనికి గోవా సీఎం ప్రమోద్ సావంత్తోపాటు రాష్ట్రంలోని పలువురు నేతలు హాజరయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా సభ ప్లాఫ్ అయ్యింది.
సాధారణంగా బహిరంగ సభ అంటేనే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తారు. అలాంటి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభ తుస్సుమన్నది. మైదానం 7ఎకరాలు ఉండగా, కేవలం ఎకరంలోపు స్థలంలోనే సభను నిర్వహించారు. అందులోనే కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు వేసిన కుర్చీలు సగం కూడా నిండలేదు. సభకు వచ్చిన వారిలో సైతం సగం మంది మధ్యలోనే వెళ్లిపోయారు. గోవా సీఎం మాట్లాడే సమయంలో జనమే లేకపోవడం గమనార్హం.
సభ ఆసాంతంలో ఒక్కసారి కూడా జోష్ కనిపించకపోవడం గమనార్హం. బీజేపీ శ్రేణులు, ప్రజల నుంచి కనీసం స్పందన లేదు. పైగా సభలో బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలు చప్పగా సాగాయి. కొందరు నేతలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కాదని, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ను తిట్టడం ఏంటనే చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా ఆరు గ్యారెంటీల అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీని కనీసం కార్నర్ చేయలేదని పలువురు అనుకోవడం కనిపించింది. ఇక ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు ప్రసంగించే సమయంలో త్వరగా ముగియాలని పదేపదే చెప్పడం కనిపించింది. ఈటల రాజేందర్ మాట్లాడుతున్నప్పుడు ఆపే ప్రయత్నం చేయగా.. ‘టైం అయ్యిందా” అని ఈటల ఒక రకమైన స్వరంతో అనడంతో అంతా సైలెంట్ అయ్యారు.
బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ ఆసాంతం గందరగోళంగా సాగింది. కొందరి నేతలను వేదికపైకి పిలువలేదని అలిగారు. వారిని మళ్లీ వేదికపైకి పిలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పుల బాషా పిలువలేదని అనడంతో, పిలిచామని మైక్లోనే ఓ నేత అనడం కనిపించింది. వేదికపై మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్క మహిళకు మాత్రమే వెనకాల రెండో లైన్ తర్వాత కూర్చోబెట్టారు. మరోవైపు బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, పీవీ శ్యామ్సుందర్ హాజరు కాలేదు.