అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు
హాలియాలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్
పీజే పాటిల్
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభం, పెద్దవూర మండలం సుంకిశాల వద్ద హైదరాబాద్కు తాగునీటిని అందించే మెట్రో వాటర్ వర్క్స్ పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ హెలిప్యాడ్ స్థలం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
హాలియా, మే 11 : మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 14న హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భగత్ కుమార్, కలెక్టర్ పీజే పాటిల్ బుధవారం ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. రూ.50కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడంతో పాటు బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఆయా ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమీక్షించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, పర్యాటక, నీటిపారుదల శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్నాయక్, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, హాలియా మున్సిపల్ కమిషనర్ వేమన్రెడ్డి, తాసీల్దార్ లావూరి మంగ, టీఆర్ఎస్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, వర్రా వెంకట్రెడ్డి, కూరాకుల రవి పాల్గొన్నారు.
పెద్దవూర మండలంలో..
పెద్దవూర/నందికొండ : మంత్రి కేటీఆర్ మెట్రో వాటర్ వర్క్స్ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో మండల పరిధిలోని పాల్తీతండా గ్రామ సమీపంలో గల సుంకిశాల వద్ద ఏర్పాట్లను కలెక్టర్, డీఎస్పీ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. అనంతరం నందికొండలోని బీసీ గురుకులంలో హెలిప్యాడ్ను కూడా పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ రోహిత్ సింగ్, ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ ఉన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
బీజేపీ, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
హాలియా, మే 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ యూత్, టీఆర్ఎస్వీ, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ యూత్, టీఆర్ఎస్వీ, సోషల్ మీడియా కార్యకర్తలపై ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా కేంద్రంగా చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వారియర్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యకుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, యువజన విభాగం మండలాధ్యక్షుడు కాట్నం నాగరాజు, పట్టణాధ్యక్షుడు కూరాకుల రవి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.