యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ), నీలగిరి, ఏప్రిల్ 12 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధ్యానిమిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖీ కేంద్రాలు తదితర ఎన్నో పథకాలను కొనసాగిస్తున్నది. ఇటీవల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నది. ముందుగానే పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందిస్తున్నది. ఇందుకోసం ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని బీబీనగర్, గుండలా పీహెచ్సీలను ఎంపిక చేసింది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వెంటనే మందులు ఇస్తున్నారు. అవసరమైతే రిఫరల్ ఆస్పత్రులకు పంపించనున్నారు. ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 536 మందికి , సూర్యాపేట జిల్లాలో 5 సెంటర్ల ద్వారా 1,753 మందికి, నల్లగొండ జిల్లాలో 6 కేంద్రాల ద్వారా 2,683 మందికి పరీక్షలు చేశారు.
8 రకాల వైద్య పరీక్షలు..
సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ఎనిమిది రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు ప్రాథమిక పరీక్షలైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బరువు పెరగడం, తగ్గడం, రుతు స్రావ సమస్యలు, ఎనీమియా, పీసీఓడీ తదితర పరీక్షలు చేస్తున్నారు. ఇవే కాకుండా అవసరం మేరకు మైక్రో న్యూట్రియెంట్ డెఫిషియెన్సీ, వెయిట్ మేనేజ్మెంట్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ మేనేజ్మెంట్, ఇన్ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవీ, థైరాయిడ్, విటమిన్ డీ-3, బీ-12 తదితర వాటిని ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 64మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఆరోగ్య మహిళ సేవలు అందుబాటులోకి రావడంతో అతివలకు అన్ని విధాలుగా మేలు జరుగుతున్నది ప్రస్తుతం ప్రైవేట్లో వైద్య సేవలు పొందితే వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సి పరిస్థితి నెలకొంది. అవసరం లేకున్నా అడ్డగోలు పరీక్షలు రాసి, పైసలు గుంజుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సర్కారే నేరుగా మహిళలకు అనేక రకాల వైద్య పరీక్షలు చేయించనుండటంతోపాటు,ఉచితంగా మందులు ఇవ్వనుండడంతో కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది.
చాలా సంతోషంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆరోగ్య మహిళా పథకానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రక్త పరీక్ష పరీక్షలు చేయడం అభినందనీయం. ఇవే పరీక్షలు బయట ల్యాబ్ల్లో చేయా లంటే చాలా ఖర్చు అవుతుంది. దవాఖాకు వచ్చే మహిళలను సిబ్బంది అప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
– తడకమళ్ల అరుణ , నేరేడుచర్ల
పరీక్షలు చేసి మందులు ఇచ్చారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయడం సంతోషం. బయట వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న పరీక్షలను కూడా ఉచితంగా చేయడం బాగుంది. డాక్టర్లు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయలేదు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కడారి భిక్షమమ్మ, వంగాల గ్రామం, గుండాల మండలం