రామగిరి, జనవరి 28 : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వ వెల్లడించిన గైడ్లైన్స్ మేరకు ఆన్లైన్ దరఖాస్తులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉండగా, తొలిరోజు పలువురు దరఖాస్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రిపరెన్షియల్ కేటగిరి (వ్యాధులతో బాధపడుతున్నవారు) ఉపాధ్యాయులు వారి వ్యాధుల పరిశీలనకు నల్లగొండ డీఈఓ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాలతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఆమోదం పొందిన తర్వాతే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మెడికల్ బోర్డులో తొలిరోజు 210 మంది ఉపాధ్యాయులు వారి సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. తొలిరోజు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో అర్హత సాధించి అనివార్య కారణాలతో హాజరుకాలేకపోయిన వారు శనివారం సంబంధిత కౌంటర్ల వద్ద హాజరై పూర్తి చేసుకున్నారు.
జీఓ నంబర్ 5 ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ మేరకు టీచర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా, 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆయా పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలకు అందజేసిన హార్డ్ కాఫీలను పరిశీలన చేసి డీఈఓ కార్యాలయానికి సమర్పిస్తారు. ఫిబ్రవరి 3 నుంచి 6వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆర్జేడీ పరిశీలన అనంతరం ఫిబ్రవరి 11, 12 తేదీల్లో బదిలీలు, ప్రమోషన్ల జాబితా వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో టీచర్ల బదిలీలకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చి 19తో షెడ్యూల్ ముగియనున్నది. అయితే ఒకే పాఠశాలలో 8 ఏండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
సూర్యాపేట అర్బన్ : ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం రెండో రోజు 456 మంది ఉపాధ్యాయులు వారి పత్రాలను వెరిఫికేషన్ చేయించుకున్నారు. బదిలీల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యాశాఖ అధికారులు పత్రాలను పరిశీలన చేశారు. ఉపాధ్యాయులు అందించిన పత్రాల ఆధారంగా సీనియారిటీ ప్రకారం పదోన్నతుల జాబితాలు సిద్ధం చేయనున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 1,925 ఖాళీలు ఉండగా పదోన్నతుల ద్వారా 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్జెక్టుల వారీగా వివరాలను జిల్లా అధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. బదిలీల ప్రక్రియలో భాగంగా శుక్ర, శనివారాల్లో మొత్తం 786 మంది తమ పత్రాలను వెరిఫికేషన్ పూర్తి చేయించుకున్నారు.
భువనగిరి అర్బన్ : జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో పనిచేస్తున్న ఎస్జీటీ, సమాన స్థాయి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందుటకు ఆదివారం పట్టణంలోని బీచ్మహాళ్ల సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి కె.నారాయణరెడ్డి శనివారం తెలిపారు. అర్హులైన వారంతా సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 1,374 ఖాళీలు ఉండగా ఈ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయ బదిలీలకు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమార్పించాలి. అందుకు సంబంధించిన హార్డ్ కాఫీలను ఆయా ప్రాంతాల కాంప్లక్స్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలకు అందజేయాలి. అక్కడి నుంచి వాటిని డీఈఓ కార్యాలయానికి పరిశీలన కోసం పంపిస్తారు. ఈ విషయంలో టీచర్లకు ఎలాంటి సందేహాలున్నా నేరుగా సంబంధింత అంశాలను ధ్రువపర్చుతూ డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పిస్తున్నాం.
-బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ