దామరచర్ల, జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వాటిని ఆన్లైన్ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని తాసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని సిబ్బందికి అప్పగించింది. సర్వర్ సమస్యతో డాటా ఎంట్రీ ఆలస్యంగా జరుగుతున్నది. ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వగా వేల సంఖ్యలో ఉన్న దరఖాస్తులు సమయానికి పూర్తయ్యేది కష్టమేనని తెలుస్తున్నది. డాటా ఎంట్రీకి అదనంగా ఆపరేటర్లను ఏర్పాటు చేయక పోవడంతో కార్యాలయ సిబ్బంది., కార్యదర్శులే డాటా ఎంట్రీ చేపట్టారు.
ప్రభుత్వం అదనంగా లాప్టాప్లు ఇవ్వక పోవడంతో వారి సొంత లాప్టాప్ల ద్వారా డాటా ఎంట్రీ నమోదు చేస్తున్నారు. ఆపరేటర్ రోజుకు 50కి మించి దరఖాస్తులు ఎంట్రీ చేయలేక పోతున్నారు. ఆపరేటర్కు మరొక వ్యక్తి సహాయకునిగా ఉండాల్సి వస్తున్నది. దామరచర్ల మండల వ్యాప్తంగా ప్రజా పాలనలో 17 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇన్ని దరఖాస్తులు ఎంట్రీ చేయాలంటే ఎన్నిరోజులు పడుతుందో అర్థంకాని పరిస్థితి. డాటా ఎంట్రీ చేస్తున్న ఆపరేటర్లకు దరఖాస్తుకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. మండల కేంద్రంలో చేపట్టిన డాటా ఎంట్రీని తాసీల్దార్ శంకర్నాయక్, ఎంపీడీఓ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు.