అమిత్షాదంతా.. అబద్ధాల షోనేనని, ఆయన ప్రతి మాటా అవాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలతో మరింత నవ్వుల పాలయ్యిండని ఎద్దేవా చేశారు. తుక్కుగూడ సభలో అమిత్షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్షా అంటే అమితమైన అబద్ధాలు చేప్పే షా అని తుక్కుగూడ మీటింగ్తో తేలిపోయిందన్నారు. బండి సంజయ్ కొంగ జపానికి ప్రజలు మోసపోరని, ఏడ్చి బతిమాలితే పదవులు కట్టబెట్టరని తెలిపారు.
అభివృద్ధి చేస్తున్న నాయకులెవరో, అభివృధ్ధి నిరోధకులెవరో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసని స్పష్టం చేశారు. అమిత్షా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని, దేశంలో ఎక్కువ అబద్ధాలు ఆడిన హోమ్ మినిస్టర్గా మాత్రం రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్మడమే వారికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు. కేంద్రం చేతగానితనం వల్లే పెరిగిన ధరలతో ప్రజలు బతుకలేని పరిస్థితి ఏర్పడిందని, బీజేపీ సర్కారును దేశవ్యాప్తంగా తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట టౌన్, మే 15 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతుంది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి.. అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే ఆయనకు సమకాలికుడు దేశంలోనే లేడు. అది జీర్ణించుకోలేకనే విపక్షాలు విషం చిమ్ముతున్నాయి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై, బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏమిచ్చిండో బీజేపీ నాయకులకైనా అర్థమైందా అని ప్రశ్నించారు. ఢిల్లీ గద్దె నుంచి బీజేపీ దిగిపోవడం ఖాయమని, ఆ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు తరిమికొడుతారని పేర్కొన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అభివృద్ధి కోసం అప్పులు చేయకుండా కుట్రలు పన్నుతున్నదన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో చీకట్లు అలుముకున్నాయని, తెలంగాణలో కూడా కరెంటు కష్టాలు వచ్చేలా బీజేపీ కుట్రలు పన్నుతుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ వల్ల ముప్పు ఉన్నదని బీజేపీ నాయకులు భయంతో వణికి పోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి లేకనే అబద్దాల ప్రచారంతో అర్థంలేని సభలు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, వాటి రహస్య ఒప్పందాన్ని త్వరలో బయట పెడుతామని చెప్పారు. కేంద్రంలో దుష్ట పాలన చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి రావడం కలలో కూడా సాధ్యం కాదన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ ప్రజలను నిలువునా దోచుకోవడం తప్ప బీజేపీ నాయకులు చేసేదేమీ లేదన్నారు తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర ప్రజానీకం నమ్ముతుందని.. ఇతర పార్టీల మోసపూరిత రాజకీయాలకు అవకాశం కలిపించరని తేల్చిచెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు.