కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా
ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రే ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోగా గురువారం ఉదయం నారాయణపూర్ డ్యాం గేట్లు ఎత్తారు. ఇక కృష్ణానదిపై రాష్ట్ర పరిధిలోని తొలి ప్రాజెక్టు జూరాలకు భారీ వరద వస్తుండడంతో మధ్యాహ్నం ఏడు గేట్లు తెరిచారు. దాంతో అక్కడి నుంచి కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా పరుగులు పెడుతున్నది. గతేడాదితో పోలిస్తే కృష్ణానదిలో వరదలు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జలకళ మొదలైంది. శ్రీశైలానికి వరద మొదలుకావడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైన ఆశలు చిగురిస్తున్నాయి. సాగర్
ఆయకట్టు రైతాంగం ఎదురుచూపులకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుండడంతో సంతోషం వ్యక్తమవుతున్నది.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 27 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై 27(నమస్తే తెలంగాణ): కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి నిండుతూ ఉన్నాయి. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం తో పాటు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానదిపై తొలి ప్రాజెక్టు ఆల్మట్టి పూ ర్తిగా నిండడంతో బుధవారం సాయంత్రమే గేట్లు ఎత్తారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆ ల్మట్టికి 1.65 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వ స్తుండగా 1.75లక్షల క్యూసెక్కుల నీటిని (అవుట్ ఫ్లో)గా విడుదల చేస్తున్నారు. దాంతో నా రాయణపూర్ డ్యామ్ను ముంచెత్తుతున్నది. గురువారం ఉదయం నారాయణపూర్ డ్యామ్ 21 గేట్లును మీటర్ పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 5గంటల సమయంలో నారాయణపూర్కు ఎగువ నుంచి 1.42లక్షల క్యూసెక్కు ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా అవుట్ఫ్లోగా నదిలోకి 1.18లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
కృష్ణానదిపై రాష్ట్రంలో తొలి ప్రాజెక్టుగా ఉన్న జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు అంతకుముందు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరదతో నిండుకుండను తలపిస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలైన వరద గురువారం సాయంత్రానికి ఇంకా జూరాలకు చేరలేదని సమాచారం. అయినా సాయంత్రం 6 గంటల స మయానికి జూరాలకు పైనున్న ప్రాజెక్టుల్లో పవర్ ఉత్పత్తి ద్వారా ఇన్ఫ్లోగా 34వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఎలాగు పైనుంచి భారీ వరద గురువారం రాత్రి చేరుతుందన్న అంచనాతో ముందస్తుగానే మధ్యాహ్నామే జూరాల ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తేసారు. జూరాల గేట్ల ద్వారా 27,846 క్యూసెక్కులు, పవర్ ఉత్పత్తి ద్వారా 42,576 క్యూసెక్కులు కలిపి మొత్తం 70,422 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు అవుట్ఫ్లోగా విడుదల చేశారు.
ఎగువ నుంచి శ్రీశైలం పాజెక్టుకు గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 71,547 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తున్నట్లు డ్యామ్ అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 817.70 అడుగుల నీటిమట్టంతో 39.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులతో 215.80 టీఎంసీలు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. పై నుంచి మొదలైన వరదతో రెండ్రోజుల్లో రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది.
అయితే ఎగువ నుంచి విడుదల అవుతున్న వరదనీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు నేటి సాయంత్రానికి చేరవచ్చని అంచనా. పూర్తి స్థాయిలో వరద రాక మొదలైతే వేగంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరగనుంది. శ్రీశైలంలో నీటిమట్టాన్ని ఆధారంగా పవర్ జనరేషన్ చేయనున్నారు. దాం తో ఆ నీరు నాగార్జునసాగర్కు రానుంది. శ్రీశైలం గేట్లు తెరిచే లోపు కరెంటు ఉత్పత్తి ద్వారా సాగర్కు 30 నుంచి 40టీఎంసీల నీరు తరలిరానుంది. నాలుగైదేండ్లుగా సీఎం కేసీఆర్ పక్కాగా ప్రణాళికతోనీటి తరలిస్తుండడంతో ముందుస్తుగానే ఆయకట్టుకు సాగునీటి విడుదలకు మార్గం సుగుమం అవుతుంది. ఈ సారి కూడా అదే జరుగుతుందన్న నమ్మకంతో సాగర్ ఆయకట్టు రైతాంగంలో సంతో షం వ్యక్తమవుతున్నది.