ఈయన పేరు బత్తుల రాజేశ్. భువనగిరి పట్టణం. దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయలతో మెడికల్, కిరాణా వస్తువుల డీలర్షిప్ తీసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సప్లయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.25 లక్షల టర్నోవర్ నడుస్తున్నట్లు తెలిపారు. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అన్ని ఖర్చులుపోనూ నెలకు రూ.40వేల వరకు మిగులుతున్నట్లు రాజేశ్ సంతోషంగా చెప్తున్నారు.
దళితోద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. మొన్నటిదాకా రోజు కూలీలు, చిరుద్యోగులుగా ఉన్నవాళ్లు, ఉపాధి లేక అవస్థలు పడ్డవాళ్లు నేడు సొంత బిజినెస్తో సగర్వంగా నిలదొక్కుకుంటున్నారు. పట్టుదలతో యూనిట్లను సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. దాంతో దళిత బంధును సద్వినియోగం చేసుకుని, దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నది. ఒక్కో యూనిట్ ద్వారా లబ్ధిదారులే గాక సగటున నలుగురికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలో దళితబంధు అమలు తీరుపై అధ్యయానికి వస్తున్న ఇతర జిల్లాల అధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి విడుతలో జిల్లావ్యాప్తంగా 300మందికి దళిత బంధు అందగా, త్వరలోనే రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సర్కారు సాయంపై దళిత వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఉపాధి లేక ఎన్నో తంటాలు పడ్డారు. కనీసం కూలి పని కూడా దొరుకని పరిస్థితి ఉండేది. పొద్దంతా పనిచేసినా రోజుకు రూ.వంద కూడా వచ్చేది కాదు. దీంతో కుటుంబం గడవక తీవ్ర ఇబ్బబందులు ఎదుర్కొనేవారు. కానీ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన వినూత్న పథకాలతో దళితుల్లో మార్పువచ్చింది. దళిత బంధు పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 300 మందిని దళిత బంధు కింద ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ డబ్బుతో లబ్ధిదారులు తమకు నచ్చిన కిరాణా, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, టీకప్పుల తయారీ, డయాగ్నోస్టిక్ సెంటర్, సెంట్రింగ్ తదితర వ్యాపారాలు పెట్టుకొని రాణిస్తున్నారు. సర్కారు సాయంతో సొంత బిజినెస్ పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కుకుంటూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 19 (నమస్తే తెలంగాణ) :
ఇతర జిల్లాల అధికారుల అధ్యయనం జిల్లాలో దళిత బంధు సమర్థవంతంగా అమలు చేస్తుండటంతో ఇతర జిల్లాల అధికారులు జిల్లా బాట పడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పైలట్ ప్రాజెక్ట్గా పథకం విజయవంతంగా అమలైన విషయం తెలిసిందే. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ సక్సెస్ఫుల్గా స్కీమ్ను అమలు చేస్తున్నారు. అమలు తీరుపై అధ్యయానికి ఇతర జిల్లాల అధికారులు వస్తున్నారు. ఇటీవల భువనగిరితోపాటు వాసాలమర్రి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా అధికారులు పర్యటించి.. వివిధ అంశాలపై అధ్యయనం చేశారు.
ఏడాదిలోనే లక్షాధికారులైండ్రు..
గతేడాది ఆగస్టులో తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా అంతటా అమలు చేశారు. సర్కారు తోడ్పాటు, అధికార యంత్రాంగం కృషితో లబ్ధిదారులంతా లక్షాధికారులయ్యారు. భువనగిరి పట్టణంలో నెలకు రూ.25లక్షల వరకు టర్నోవర్తో బిజినెస్ నడుస్తున్నది. ఇందులో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల దాకా ఆదాయం వస్తున్నదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బిజినెస్ను మరింత విస్తరించేందుకు లబ్ధిదారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పని చేసుకుంటూ.. మరికొందరికి ఉపాధినిస్తూ…
దళిత బంధు పథకం లబ్ధిదారులకు ఉపాధిని ఇవ్వడమే కాకుండా మరి కొందరికి పని కల్పిస్తున్నది. గ్రామంలోనే వినూత్నమైన వ్యాపారాలు పెడుతుండటంతో ఇతర సిబ్బంది, వర్కర్లు అవసరం అవుతున్నారు. దీంతో మరికొందరికి ఉపాధి లభిస్తున్నది. ఒక్కో యూనిట్లో నలుగురు నుంచి ఐదుగురు పనిచేస్తున్నారు. కొందరు కార్లు అద్దెకు తీసుకొని నడిపిస్తుండటంతో బయట డ్రైవర్లకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులు కాకుండా మరో వెయ్యి మందికి వరకు పని దొరుకుతుండటం గమనార్హం.
రెండో విడుతకు ఏర్పాట్లు..
దళిత బంధు పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడుత అమలు కోసం అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తున్నారు. గత సంవత్సరం నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి.. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందించారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1500 మందికి ఇవ్వనున్నారు. దీంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కొత్త దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఒత్తుల తయారీతో రోజుకు రూ.1500
దళిత బంధు పథకం కింద ప్రభుత్వం రూ.10లక్షలు ఇచ్చింది. రూ.2.10 లక్షలతో ఒత్తుల తయారీ మిషన్, రూ.1.60లక్షలతో రెండు బర్రెలు కొనుగోలు చేశాం. మిగిలిన డబ్బుతో మాకున్న రెండు ఎకరాల పొలాన్ని చదును చేసి బోరు వేసుకొని వ్యవసాయం చేస్తున్నం. గేదెల పాలతో నెలకు రూ.10వేలు మిగులుతున్నాయి. ఒత్తుల తయారీతో రోజుకు రూ.1500కు పైగా ఆదాయం వస్తుంది. గతంలో నేను, నా భర్త రోజువారి కూలి పనులకు వెళ్లేది. చాలీచాలని సంపాదనతో అంతంత మాత్రంగా ఉండేది. డబ్బుల్లేక మా పిల్లలకు ఉన్నత విద్య చెప్పించలేకపోయాం. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నాం.
– బొల్లారం లావణ్య, వాసాలమర్రి
బతుకునిచ్చిన దళితబంధు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మా కుటుంబానికి జీవనోపాధిగా మారింది. గతంలో నేను లారీ డ్రైవర్. వచ్చిన జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దళితబంధు ద్వారా సర్కారు అందించిన సాయంతో టీ గ్లాసుల తయారీ యూనిట్ రూ.7.50లక్షలు, పేపర్ ప్లేట్ల యూనిట్ రూ.2.50లక్షలతో ఏర్పాటు చేశాం. ఈ యూనిట్లతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. గతంలో నేను, మా కుటుంబ సభ్యులం రెండు నెలలు కష్టపడి పనిచేసినా ఇరవై వేల సంపాదన లేకుండే. ప్రస్తుతం నెలకు రూ.40వేల చొప్పున మిగులుతున్నాయి. దీంతో ఉన్నతంగా జీవించడంతోపాటు నాలుగు డబ్బులు వెనుకేసుకుంటున్నాం.
– బొల్లారం రవి, వాసాలమర్రి, – తుర్కపల్లి, జూలై 19
మరో నలుగురికి పని కల్పిస్తున్నా..
చిన్నప్పటి నుంచీ సెంట్రింగ్ కూలీగా పనిచేస్తున్నా. రోజూ హైదరాబాద్కు పోయి రావడం ఇబ్బందిగా ఉండేది. నా సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. దళితబంధు డబ్బులు రూ.7.50లక్షలతో సెంట్రింగ్ సామాను కొన్నా. ఇప్పుడు ఊర్లోనే బిల్డింగ్లకు సెంట్రింగ్ బిగిస్తున్నా. నెలకు రూ.50వేల వరకు మిగులుతున్నాయి. మరో నలుగురికి పని కల్పిస్తున్నా. దళిత బంధు డబ్బు రాకుంటే రోడ్డున పడే పరిస్థితి మాది.
– బొల్లారం ఆనంద్, వాసాలమర్రి
ఫ్యాక్టరీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి..
నేను గతంలో హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీలో వెల్డర్గా పనిచేసేవాన్ని. దళితబంధు డబ్బులతో ఊర్లోనే వెల్డింగ్ షాపు పెట్టిన. ఏసీ, ఆక్సిజన్ గ్యాస్కట్టర్ వంటి సామాన్లు కొనుక్కున్న. చర్లపల్లిలో పనిచేస్తే అన్ని ఖర్చులుపోను నెలకు నాలుగైదు వేలు మిగిలేవి. ఇప్పుడు ఉన్న ఊర్లోనే నెలకు రూ.50వేల వరకు సంపాదిస్తున్న. చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
– కొండాపురం నగేశ్, వాసాలమర్రి