నిడమనూరు, ఏప్రిల్ 1 : ఎన్నికల విధులను ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎన్నికల విధులపై ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర అవగాహనతో ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. అనంతరం ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిడమనూరు, అనుముల, తిరుమలగిరి(సాగర్), గుర్రంపోడు తాసీల్దార్లు జంగాల కృష్ణయ్య, జయశ్రీ, యాదగిరి, కిరణ్ ఎంఈఓ రాము, సిబ్బంది రాజిరెడ్డి, సందీప్, అనిల్కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల విధులను
మిర్యాలగూడ : ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీఓ శ్రీనివాస్రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంలో పీఓ, పీఏఓల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఉద్యోగి నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల కోడ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆధారాలు లేకుండా పలు వాహనాల్లో తీసుకెళ్తున్న రూ.31,39,367 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ అసెంబ్లీ పరిధిలో 264 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకుంటే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 8689295001కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే 90 నిమిషాల్లోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో తాసీల్దార్లు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.