మిర్యాలగూడ, మార్చి 19 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని సోమవారం రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అయినా.. రైస్ మిల్లర్ల తీరు మారలేదు. మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. సన్న ధాన్యానికి రేటు పెట్టడం లేదు. సోమవారం సాయంత్రం వచ్చిన ధాన్యాన్ని మంగళవారం కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్ల మీదనే ట్రాక్టర్లు పెట్టుకొని అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు అడిగిన ధరకే అమ్ముకున్నారు.
ఈ యాసంగి సీజన్లో మహేంద్ర చింట్లు, కావేరి చింట్లు, హెచ్ఎంటీ రకాలైన సన్న ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి మిల్లర్లు పంటల కోతల సమయంలో క్వింటా రూ.2600 నుంచి రూ.2700 వరకు కొనుగోలు చేశారు. వారం రోజులుగా ధాన్యం ట్రాక్టర్లు మిల్లుల వద్దకు భారీగా వస్తుండడంతో మిల్లర్లు సిండికేట్గా మారి తక్కువ ధరకే అడుగుతున్నారు. క్వింటా రూ.2100 నుంచి రూ.2300 వరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టం లేకపోతే తీసుకుపో అని బెదిరిస్తున్నారు. రైతులు రాగానే మాకు ధాన్యం వద్దు అని మిల్లర్లు చెప్తున్నారు. రోజంతా పడిగాపులు కాసిన రైతులు విధిలేని పరిస్థితిలో బతిమిలాడుకొని అడిగిన కాడికి ఇచ్చిపోతున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగానే మిర్యాలగూడలో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించేవారు. ఈ యాసంగి సీజన్ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయలేదు. రైతులు రోడ్ల మీదనే ట్రాక్టర్లను నిలిపి ఇబ్బందులకు గురవుతున్నా కనీసం పట్టించుకునే వారు లేరు. అధికారులు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి వెళ్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారు లేకపోవడంతో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నో కష్టాలకు ఓర్చి పంటలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పచ్చగింజ పేరుతో దోపిడీ..
యాసంగిలో వరి పొలాలను యంత్రాల ద్వారా కోయడం వల్ల ధాన్యంలో అక్కడక్కడ పచ్చ గింజ ఉంటుంది. దీన్ని సాకుగా చూపి క్వింటాకు రూ.200 నుంచి రూ.300 వరకు కోత విధిస్తున్నారు. కనీసం రూ.2500 ధర అందించాలని అధికారులు చెప్పినా రైస్ మిల్లర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. సోమవారం తీసుకొచ్చిన ధాన్యం మంగళవారం కూడా కొనుగోలు చేయడం లేదని వేములపల్లి, త్రిపురారం మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేయకపోవడంతో ట్రాక్టర్ కిరాయి ఎక్కువవుతుందని చెప్తున్నారు.
తక్కువ ధరకే అమ్ముకున్నా
బోరు ఆధారంగా ఐదెకరాల్లో సన్న ధాన్యం పండించా. మూడు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొని మిర్యాలగూడలో 15 మిల్లులు తిరిగిన. చివరికి విసిగి వేసారి నాణ్యంగా ఉన్న వడ్లను క్వింటాకు రూ.2300 చొప్పున అమ్ముకున్నా. ఇంత తక్కువ ధరకు అమ్మడం చాలా బాధగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు రావడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇంత అన్యాయం రైతులకు ఎన్నడూ జరుగలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలి.
– ఎ.సైదులు, రైతు, త్రిపురారం