బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో
అత్యధికంగా 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం, వరదతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. మూసీనదితోపాటు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కల్వర్టుల మీదుగా వరద పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు ముందే అప్రమత్తం కావడంతో విపత్కర పరిస్థితులు చోటుచేసుకోలేదు.
వివిధ శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్యా రాకుండా చూస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసరమైన వారికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆలేరు పట్టణంలో వరదలో చిక్కిన 19 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి వసతి, భోజన సౌకర్యం కల్పించారు. వరద ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈదురు గాలులకు రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించారు. రెండ్రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 86 కరెంట్ స్తంభాలు నేలకొరగగా, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పునరుద్ధరించారు. కొన్ని చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడగా పునరుద్ధరించే పనుల్లో నీటిపారుదల శాఖ నిమగ్నమైంది. మద్దిరాలలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, భువనగిరిలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, చౌటుప్పల్లో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లాలో సగటున 108.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అడ్డగూడూరులో 117.8 మి.మీ., ఆలేరులో 112.5మి.మీ., గుండాలలో 108, యాదగిరిగుట్టలో 99.6, తుర్కపల్లిలో 98.2, మోత్కూరులో 97.6, రాజాపేటలో 85.4, మోటకొండూరులో 91.8, భువనగిరిలో 90.8మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 71శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. 235.5 మి.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 400.2 మి.మీ. వర్షపాతం రికార్డవడం గమనార్హం.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇది 24గంటలు పనిచేస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కంట్రోల్ రూమ్ నంబర్ 08685293312, లేదా వాట్సాప్ 9121147135ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పాతబడిన, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, బాగా నానిన ఇండ్లలో ఉండొద్దని సూచించారు. వాళ్లందరినీ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాళ్లు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
వానలు, వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆలేరు పట్టణంలోని రంగనాయకుల వీధిలో వరద ప్రవాహంతో ఇబ్బందులు పడిన 19 కుటుంబాలను దగ్గరలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడే వారికి భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇంటికి పంపించారు. జిల్లాలో స్వల్పంగా ఆస్తి నష్టం జరగ్గా, ప్రాణ నష్టం, పంట నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 55 ఇండ్లు పాక్షికంగా కూలిపోగా, వివరాలను సేకరించి సాయం చేసేందుకు చర్యలు చేపట్టారు.
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. డీఈ, ఏఈ, సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ నెల 15నుంచి జిల్లాలో నేలకొరిగిన 250 స్తంభాలను పునరుద్ధరించినట్లు ఎస్ఈ శ్రీనాథ్ తెలిపారు. బుధ, గురువారాల్లో 86 స్తంభాలు విరిగిపడ్డాయని.. ఒకటి, రెండు చోట్ల మినహా అన్నింటినీ పునరుద్ధరించారు. నిరంతరం విద్యుత్ను సరఫరా చేశారు. అదేవిధంగా సర్కిల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 9491065938 నంబర్ను 24గంటలు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో సహాయక చర్యలకు అధికారులతోపాటు పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడటంతో పోలీసులు తొలగించారు. కాల్వలు, చెరువులు, మూసీ ప్రవాహం, రాకపోకలు నిలిచిన చోట్ల హోంగార్డులు, పోలీసులను పహారా పెట్టారు. భువనగిరి మండలంలో రోడ్లపై పడిన చెట్లను జేసీబీ సాయంతో భువనగిరి రూరల్ పోలీసులు తొలగించారు. రాజాపేట మండలంలో రోడ్లపై చెట్లు విరిగి పడగా, స్థానిక పోలీసులంతా కలిసి తీసివేశారు. ఇండ్లు కూలిపోయిన వారి వద్దకు వెళ్లి తగిన సూచనలు చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారులు మొదలుకొని జిల్లా, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. వరదల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుకున్నారు. చెరువులు, కుంటలు, నీటి ప్రవాహాల వద్ద 24గంటల గస్తీ ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని ఆదేశించారు. లోలెవల్ వంతెనలు, కాజ్వేల గుండా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజాపేట మండలంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలేరు, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పర్యటించి తగు సూచనలు చేశారు. బీబీనగర్ మండలం రాఘవాపురంలో బునాదిగాని కాల్వకు గండి పడటంతో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు వెళ్లి మరమ్మతు పనులను పరిశీలించారు.
జిల్లాలో ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి. నీటిపారుదల శాఖ అధికారులు వాటిని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. వాగులు, చెరువుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు వీఆర్ఏలను నియమించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాజాపేట మండలంలోని పొట్టిమర్రి, బేగంపేట, దూది వెంకటాపురం, నెమిలె సోమారం వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంటంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి మండలంలోని గోపాలపురంలో పోచమ్మ చెరువు నిండి అలుగు పోస్తున్నది. నీటి ఉధృతికి అలుగు వద్ద కట్ట కుంగి ప్రమాదకరంగా మారడంతో తాసీల్దార్ సూచన మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాలకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. వలిగొండ మండల సంగెం వద్ద భీమలింగం లో లెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పోలీసులు రాకపోకలను నిలిపేశారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ వరద వెళ్తుండటంతో రుద్రవెల్లి-జూలూరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మోత్కూరులో బిక్కేరు వాగు ఉప్పొంగడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కేరు వాగు కాజ్వేల పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మోటకొండూరు మండలంలో బిక్కేరు వాగు ప్రవహిస్తుండటంతో అమ్మనబోలు, గొలనుకొండ, కాటేపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు.