యాదాద్రి, నవంబర్ 28: హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూడేనికి చెందిన వి. నాగమల్లయ్య(53) పట్టణంలోని పాతగుట్టలో ఉంటు న్నాడు. గతంలో మోటకొండూర్ మండలంలోని కాటెపల్లిలో ఉండి రాడికల్ గ్రూప్లో పనిచేసి 1991లో ఆత్మకూరు(ఎం) పోలీసులకు లొంగిపోయాడు. బస్సును తగలబెట్టిన కేసులో అరెస్టయిన జైలుకెళ్లిన నిందితుడు బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూడేనికి వలస వెళ్లి అక్కడే భూమిని కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన అమృతరావు వద్ద కొనుగోలు చేసిన 212 గంజాల భూమికి సంబంధించిన వివాదం నెలకొన్నది. ఈ వివాదంలో పెద్దిరెడ్డిగూడేనికి చెందిన హతుడు సాధునేని మనోహర్రావు జోక్యం చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నాగమల్ల య్య కూతురు ఆ ప్రాంతానికి చెందిన యశ్వంత్రెడ్డితో ప్రేమలో పడిందని, పెళ్లి చేయాలని మనోహర్రావు ఆయనకు సూచించాడు. కులాలు వేరైనందున వారి వివాహాన్ని నాగమల్లయ్య నిరాకరించాడు. దాంతో ఆయన కుమార్తె యశ్వంత్రెడ్డితో పారిపోయి పెళ్లి చేసుకున్నది.
మనోహర్రావు మద్దతుతోనే తన కుమార్తె వివాహం జరిగిందని భావించిన నాగమల్లయ్య అతడిని చంపేందుకు పథకం వేశాడు. యాదగిరిగుట్ట మార్కెట్లో గొడ్డలి కొనుగోలు చేసి అవకా శం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో 2016 ఏప్రిల్ 11న ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఇసుక కొనుగోలు చేయాలని నాగమల్లయ్యను హతుడు మనోహర్రావు కోరాడు. మరుసటి రోజు గుచ్చకుండలో ఇసుక దొరుకుతుందని నమ్మబలికిన నాగమల్లయ్య ఆ ప్రాంతానికి రాగానే మనోహార్రావుపై గొడ్డలితో మెడపై దాడి చేశాడు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
నిందితుడు ఆధారాలు మార్చేందుకు ప్రయత్నించి, గొడ్డలిని, బకెట్ను పొదల్లోకి విసిరి, మృతదేహాన్ని వాగులో పూడ్చి పెట్టి పారిపోయాడు. మృతుడి కుమారుడు మధుకర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అప్పటి ఎస్ఐ రఘువీరారెడ్డి నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం పూర్తి ఆధారాలతో భువనగిరి కోర్టుకు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా విచారణ చేపట్టిన భువనగిరి ఏడీజే కోర్టు న్యాయమూర్తి మారుతీదేవి సోమవారం నిందితుడు నాగమల్లయ్యకు జీవితఖైదుతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసును ఛేదించిన సీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐలు సైదయ్య, నవీన్రెడ్డిను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించి రివార్డులు ప్రకటించారు.