నీలగిరి, డిసెంబర్ 4 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ జరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ కృష్ణా ట్రావెల్స్కు చెందిన బస్సు 38 మంది ప్రయాణికులు, డ్రైవర్, హెల్పర్తో కలిసి హైదరాబాద్ నుంచి చీరాలకు బయల్దేరింది. అద్దంకి-నార్కట్పల్లి రహదారి మీదుగా వెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో నల్లగొండ జిల్లా కేంద్రం శివారు పానగల్ సమీపంలోకి రాగానే ఏసీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఒకసారిగా ఎగిసిపడ్డాయి.
ఈ సమయంలో బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను నిద్రలేపారు. ప్రయాణికులంతా బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మంటలు ఎగిసిపడి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఒకరు మాత్రం బయటికి రాలేక సజీవ దహనమైనట్లు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాలిపోయిన వ్యక్తి శరీర భాగాలు, ఎముకలను గుర్తించిన పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ఎముకలను ల్యాబ్ కు తరలించారు. మిగిలిన ప్రయాణికులకు చిన్న, చిన్న గాయాలయ్యాయి.. ప్రమాదం ఏమీ జరుగలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్, బంగారంతోపాటు అమెరికా వెళ్లాలనే ఓ అమ్మాయి వీసా పాస్పోర్టు కాలిపోయినట్లు నల్లగొండ రూరల్ ఎస్ఐ కంచర్ల భాస్కర్రెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.